
Breakup : ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకున్నాం.. పెద్దల నుంచి రక్షణ కల్పించండి అని ఎస్సైని ఆశ్రయించింది. కలుపుతానని నమ్మకంగా చెప్పిన ఎస్సై.. ఆ జంటను విడదీశాడు. ప్రియుడి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేయిస్తామని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు మోసం చేశారనే మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై జోక్యంతోనే ఇలా జరిగిందని ఇప్పుడు బాధిత కుటుంబం ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తోంది.
ప్రేమే నేరమా..
గ్రామానికి చెందిన దండుగుల వరప్రసాద్(24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనులు చేసేవాడు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకొని బీబీపేట ఠాణాకు తీసుకొచ్చారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని చెప్పారు. రక్షణ కల్పించాలని కోరాడు. ఇద్దరూమేజర్లే కావడంతో ఎస్సై భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబసభ్యులు ఎస్సైని కలిశారు. తమ కూతురును అప్పగించాని కోరారు. దీంతో సదరు ఎస్సై.. ఆ జంటను పిలిపించాడు. పది రోజుల తరువాత పెద్దల సమక్షంలో వివాహం చేయిస్తామని యువతిని ఒప్పించారు. దీంతో వరప్రసాద్ అంగీకరించాడు. ఈ మేరకు ఠాణాలో లేఖ రాసిచ్చి యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు.

మనసు మార్చారు..
అయితే కూతురును తీసుకెళ్లిన తల్లిదండ్రులు పది రోజుల్లో ఆమె మనపు మార్చారు. కౌన్సెలింగ్ చేశారు. ప్రియుడు అంటే ద్వేషించేలా చేశారు. ఫలితంగా పది రోజుల తర్వాత అమ్మాయి మనసు మార్చుకుని ఎవరంతట వారు ఉందామని వరప్రసాద్కు చెప్పి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన వరప్రసాద్ మార్చి 24న మెదక్ జిల్లా రామాయంపేట శివారులో పురుగుల మందు తాగాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. యువతి, ఆమె కుటుంబసభ్యులే తన కొడుకు చావుకు కారణమని తండ్రి దండుగుల స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు..
ప్రేమికులను ఎస్సై సాయికుమార్ విడదీశారంటూ మండల కేంద్రంలోని ఆయా చోట్ల ఆయనతోపాటు వరప్రసాద్ పెళ్లి చేసుకున్న చిత్రాలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టింది. పెళ్లి చేసుకొని ఠాణాకు వెళ్తే అమ్మాయిని బెదిరించి కుటుంబసభ్యులకు అప్పగించారని ఆరోపించారు.
ఎస్సైని తప్పించాలని ఆందోళన..
వరప్రసాద్ ఆత్మహత్యకు కారణమైన ఎస్సైని విధుల నుంచి తొలగించాలని ఆయన కుటుంబీకులు, బంధువులు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు.