Delhi CM Rekha Gupta : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. సొంతంగానే మెజారిటీని దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలాన్ని కలిగి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. బిజెపి ఢిల్లీ మాజీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, శిఖా రాయ్, ఆశిష్ సూద్, పర్వేష్ సాహిబ్ సింగ్, రవీంద్ర ఇంద్ర రాజ్ సింగ్, కైలాష్ గంగవాల్, అనిల్ గోయల్, రాజ్ కుమార్ భాటియా పేర్లు వినిపించాయి. అయితే యాదృచ్ఛికంగా రేఖా గుప్తా పేరును బిజెపి అధిష్టానం ఖరారు చేయడం.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం బుధవారం సాయంత్రం చక చకా జరిగిపోయాయి. బిజెపి అధిష్టానం గతంలోనూ ముఖ్యమంత్రుల ఎంపికలో గోప్యత పాటించింది. చత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. మీడియా కోడై కోసినట్టుగా.. సోషల్ మీడియాలో వినిపించినట్టుగా కాకుండా కొత్త వ్యక్తులను ముఖ్యమంత్రులుగా నియమించింది. సామాజిక సమీకరణాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలు.. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రులను బిజెపి అధిష్టానం నియమిస్తోంది.
ఇదీ రేఖా గుప్తా నేపథ్యం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేఖా గుప్తా.. బినోయ్ సామాజిక వర్గానికి చెందినవారు. విద్యార్థి దశ నుంచి ఆమె రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. 1996 -97 కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. దక్షిణ ఢిల్లీ మేయర్ గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఆమె ఢిల్లీ బిజెపి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవల షా లిమార్ బాగ్ నియోజకవర్గంలో పోటీ చేశారు. 68,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాస్తవానికి ఈమె పేరును బిజెపి అధిష్టానం ఎప్పుడో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంది. అయితే ఆ విషయంలో చాలావరకు గోప్యత పాటించింది. ఆ తర్వాత ఒక కమిటీని నియమించి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంది. ఆ తర్వాత అధిష్టానం కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతిమంగా బుధవారం సాయంత్రం రేఖా గుప్తా పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే దానికంటే ముందు బిజెపి శాసనసభ పక్షం సమావేశమైంది. ఆ సమావేశంలోనే రేఖా గుప్తా పేరును బిజెపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని బిజెపి వెల్లడించింది. రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారు.