భారతీయులు ఎవరినైనా ప్రేమిస్తే గుండెల్లో స్థానం ఇస్తారు. ఆ ప్రేమ పెరిగిపోతే గుడి కూడా కట్టేస్తారు. ఇప్పుడు యువభారత్లో సంచలన ఆటగాడు వైభవ్ సూర్య వంశీ కి అభిమానులు కచ్చితంగా గుడి కడతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు..
ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు రాజస్థాన్ జట్టు తరుపున సెంచరీ చేశాడు వైభవ్ సూర్య వంశీ. కేవలం 14 సంవత్సరాలు దాటని వయసులో అతడు ఆ ఘనత అందుకున్నాడు. ప్రపంచ స్థాయి మేటి బౌలర్లను ఓడించి సత్తా చూపించాడు. తద్వారా తను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో నిరూపించాడు.
అండర్ 19 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 175 పరుగులు చేశాడు వైభవ్ సూర్య వంశీ. ఈ మ్యాచ్లో ఆరోన్ జార్జ్ (9) వికెట్ త్వరగానే కోల్పోయినప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత అతడు తన అసలు సిసలైన ఆటను ప్రదర్శించాడు. తద్వారా భారత జట్టు స్కోరును రాకెట్ వేగానికి మించి దూసుకు వెళ్లే విధంగా చేశాడు. ఒక్కో ఓవర్ లో 12 పరుగులకు మించి రన్ రేట్ ఉండేలా చూసుకున్నాడు. తద్వారా భారత్ ఏకంగా 411 పరుగులు చేసింది.
ఫైనల్ మ్యాచ్లో 300 కు మించి పరుగుల లక్ష్యం ఉంటేనే టీమ్ ఇండియా గెలుస్తుందని వైభవ్ సూర్య వంశీ కి తెలుసు. ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అంతటి లక్ష్యాన్ని ఎలా ఫినిష్ చేసింది కూడా అతడికి తెలుసు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టు ఎదుట అంతకు మించిన భారీ లక్ష్యం ఉండాలని వైభవ్ సూర్య వంశీ భావించాడు. దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 175 పరుగులు చేశాడు.
ఫైనల్ మ్యాచ్లో ఒకానొక దశలో 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్య వంశీ.. జేమ్స్ మింటూ వేసిన ఓవర్లో 18 పరుగులు సాధించాడు. ఇక అప్పటినుంచి అతడు వెను తిరిగి చూసుకోలేదు. కేవలం 32 బంతుల్లోనే తన నాలుగవ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు. ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. చూస్తుండగానే తన వ్యక్తిగత స్కోరును 96 పరుగుల వద్దకు చేర్చుకున్నాడు. జస్ట్ 20 ఓవర్ ముగిసే వరకే సెంచరీ సాధించాడు సూర్యవంశీ. 12 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మైదానంలో సూర్యవంశం మాయాజాలం సృష్టించాడు. చూస్తుండగానే 150 పరుగులు చేశాడు. అంతే వేగంగా తన వ్యక్తిగత స్కోర్ 175 వద్దకు చేర్చుకున్నాడు. అనుకోకుండా అవుట్ కావడంతో అతడి ప్రస్థానం ముగిసింది.
