మనలో చాలామందికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇక పండుగల పూట నాన్ వెజ్ వండుకొని తినడం అంటే మరింత ఇష్టం. నాన్ వెజ్ లో చాలామంది మటన్ ఇష్టపడుతుంటారు. మటన్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.. పైగా స్పైసీగా ఉంటే అది అద్భుతమైన రుచితో ఉంటుంది. అందువల్లే చాలామంది మటన్ తినడానికి ఇష్ట పడుతుంటారు.
ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రిలో ఓ వ్యక్తి మటన్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దానిని ఇంటికి తీసుకొచ్చాడు. అతడి సతీమణి మటన్ వండడాన్ని ప్రారంభించింది. కుక్కర్లో వేసి ఉడికించినప్పటికీ మటన్ ఏమాత్రం ఉడకడం లేదు. ఇలా అనేక పర్యాయాలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఆమె అతనితో గొడవ పడింది. దీంతో కుక్కర్లో ఉన్న మటన్ తో అతడు నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లాడు.
“సార్ నేను ఉగాది పండుగ సందర్భంగా తలకాయ కూర తెచ్చుకున్నాను. మా భార్య ఎంతో ఇష్టంతో కుక్కర్లో వేసింది. వండడానికి ప్రయత్నించింది. ఎంతసేపటికి ఆ కూర ఉడకలేదు. నా దగ్గర అతడు వేయి రూపాయల వరకు తీసుకున్నాడు. అన్ని డబ్బులు తీసుకుని నాసిరకమైన తలకాయ కూర ఇచ్చాడు. ఈ కూర ఉడకలేదు. నా బాధను మీరు అర్థం చేసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని” అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అసలే పండుగ.. ఆపై ఉడకని తలకాయ కూర తో అతడు స్టేషన్ కు రావడంతో పోలీసులకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత పోలీసులు అతడిని తీసుకొని మటన్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్లారు.. జరిగిన విషయం మొత్తం అతనితో చర్చించారు. తాను తెచ్చుకున్న తలకాయ కూర ఉడకలేదని.. తనను మోసం చేశారని ఆ వ్యక్తి అక్కడ కూడా గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడు అలా మాట్లాడుతూ ఉండడంతో మటన్ అమ్మిన వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పోలీసులను తీసుకొని రావడంతో భయపడ్డాడు. ఆ తర్వాత కిలో మటన్ తో పాటు.. కిలో తలకాయ మాంసం కూడా అతడికి ఇచ్చి పంపించాడు. పండగ పూట మటన్ ఉడకలేదని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం.. పోలీసులు నేరుగా మటన్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్లి పంచాయతీ సెటిల్ చేయడంతో.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.