Tilak Varma century : ప్రమాదకరమైన సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు.. నమన్ ధీర్ కూడా ఉన్నాడు. డికాక్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. హార్దిక్ పాండ్యా వంటివాడు ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. ఇదీ స్థూలంగా సోమవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి.
గాయం వల్ల రోహిత్ శర్మ మైదానం లోకి రాలేదు. ఉన్న ప్లేయర్లు చేతులెత్తేశారు. అదిగో అప్పుడు వచ్చాడు యోధుడి లాగా తెలుగోడు తిలక్ వర్మ. వికెట్లు పడినచోట.. గుజరాత్ బౌలర్లు రెచ్చిపోతున్న చోట అతడు నిలబడ్డాడు. మామూలుగా అతడి స్థానంలో ఇంకొక ఆటగాడు గనుక వచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ తాను మాత్రమే పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఆవేశానికి పోలేదు. అనవసరమైన షాట్లు ఆడలేదు. అలాగని చెత్త బంతులను వదిలిపెట్టలేదు. సిరాజ్, రబాడ, రషీద్ వంటి వారు నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తుంటే.. తిలక్ వర్మ రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాగని గతి తప్పిన బంతులను ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఫలితంగా ఈ ఐపిఎల్ లో సెంచరీ కొట్టేశాడు. 45 బంతులు ఎదుర్కున్న అతడు ఎనిమిది ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 101* పరుగులు చేశాడు..
తిలక్ వర్మ మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి 5.5 ఓవర్లలో 44/3 గా ఉంది ముంబై జట్టు పరిస్థితి. ఆ సమయంలో బ్యాట్ చేత పట్టుకున్న తిలక్ వర్మ నమన్ ధీర్ (45) తో నాలుగో వికెట్ కు 52 పరుగులు, ఐదో వికెట్ కు హార్దిక్ పాండ్యా(15)తో 81 పరుగులు, రూథర్ ఫర్డ్ తో ఆరో వికెట్ కు అజేయంగా 22 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా ముంబై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
సూర్య కుమార్ యాదవ్ విఫలం కావడం.. డికాక్ చేతులెత్తేయడం.. మాలే వార్ రెండు పరుగులకే అవుట్ కావడంతో ముంబై జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. ఈ దశలో రంగంలోకి దిగిన తిలక్ వర్మ సత్తా చూపించాడు. తనను ముంబై జట్టుకు ఆపద్బాంధవుడు అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. గొప్ప గొప్ప ప్లేయర్లు విఫలమవుతున్న వేళ.. తను మాత్రం దీప శిఖలాగా నిలబడ్డాడు. అందువల్లే ముంబై జట్టు ఆ స్కోర్ చేయగలిగింది. వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న ముంబై జట్టుకు.. తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు డికాక్, సంజు శాంసన్ సెంచరీలు చేశారు. ఆ జాబితాలో తిలక్ వర్మ చేరిపోయాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో గట్టిగా నిలబడి.. తన స్థాయి నిరూపించుకున్నాడు.