ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు సారధిగా కమిన్స్ వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో కూడా అతడే నాయకుడిగా ఉన్నాడు. 2024లో హైదరాబాద్ జట్టును అతడు ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్ లో కోల్ కతా చేతిలో హైదరాబాద్ జట్టు భంగపాటుకు గురి అయింది. అయినప్పటికీ హైదరాబాద్ యాజమాన్యం కమిన్స్ మీద పూర్తిస్థాయి నమ్మకంతో ఉంది. అందువల్లే 2025.. 2026 సీజన్లో కూడా అతడిని అంటి పెట్టుకుంది.
కమిన్స్ గత సీజన్లో మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. తన స్థాయిలో బంతులు వేయలేకపోయాడు. అయినప్పటికీ హైదరాబాద్ యాజమాన్యం అతడిని జట్టులోనే కొనసాగించింది. అయితే ప్రస్తుత సీజన్లో అతడు హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా కమిన్స్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అందువల్లే అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నాడు. టి20 వరల్డ్ కప్ కూడా అతడు ఆడలేదు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన యాసెస్ సిరీస్ లో కేవలం ఒక్క మ్యాచ్ కు మాత్రమే పరిమితమయ్యాడు.
కమిన్స్ వెన్ను నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ లో అతడు హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్లలో అతడి స్థానంలో అభిషేక్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. వైద్యుల సలహాల మేరకు ఆ తదుపరి మ్యాచ్లకు కమిన్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనిపై హైదరాబాద్ యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం అభిషేక్ శర్మ హైదరాబాద్ కెప్టెన్ అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. ఇతడికి హెడ్ జతగా ఉన్నాడు. వీరిద్దరికీ ఐపీఎల్లో అత్యంత ప్రమాదకరమైన జోడి అని పేరు ఉంది. వీరిద్దరూ బాంబు బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ అనేకం నిర్మించారు. ఈసారి కూడా వీరిద్దరి మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందువల్లే హైదరాబాద్ యాజమాన్యం 2026 సీజన్లో కూడా వీరిద్దరిని జట్టులోనే ఉంచుకుంది. అభిషేక్ శర్మ ఈసారి ఓపెనర్ గానే కాకుండా.. కెప్టెన్ గా కూడా హైదరాబాద్ జట్టుకు సేవలు అందించబోతున్నాడు.