Iran Israel conflict : పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 36 గంటల్లో ఐదు కీలక పరిణామాలు చోటుచేసుకోగా, వాటి ప్రభావం భారత్పై నేరుగా పడుతోంది. నిత్యావసర ధరల నుంచి భౌగోళిక రాజకీయ సమీకరణాల వరకు పరిస్థితులు మారనున్నాయి.
ఇజ్రాయెల్కు పాకిస్తాన్ వార్నింగ్..
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇరాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో పడింది. దీనిపై ఇస్లామాబాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి దౌత్య ప్రాంతాలపై దాడులు చేయొద్దు‘ అని ఇజ్రాయెల్కు హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ ఈ వార్నింగ్ ఇవ్వడం కేవలం దౌత్య మర్యాద కాదు. భవిష్యత్తులో ఇజ్రాయెల్–పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష ఘర్షణకు ఇది నాంది కావచ్చు. ‘ఖతార్లా చూస్తూ ఊరుకోబోం‘ అని పాకిస్తాన్ స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. భారత్–ఇజ్రాయెల్ కలిసి పాకిస్తాన్పై దాడికి పన్నాగాలు పన్నుతున్నాయని ఇస్లామాబాద్ ఆరోపించడం ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచింది.
ఇరాన్ క్షిపణులపై ‘థ్యాంక్యూ ఇండియా‘..
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులపై ఇండియా, స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్ వంటి దేశాల పేర్లు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. ఇరాన్ తన దాడులు కేవలం సైనిక లక్ష్యాలపైనేనని, పౌరులపై కాదని నిరూపించుకోవడానికి ఈ పేర్లను వాడింది. యుద్ధం మొదలైన తర్వాత భారత్ వైద్య సహాయం పంపించడం, శాంతి చర్చలకు మొగ్గు చూపడంతో ఇరాన్ ఈ సంకేతం ఇచ్చింది. పాకిస్తాన్ను తన వైపు తిప్పుకోవడానికి ఇరాన్ ఈ ఉపాయం పన్నిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా నిఘా విమానం ధ్వంసం..
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన కీలకమైన బోయింగ్ ఈ–3 సెంట్రీ (ఏడబ్ల్యూఏసీ) నిఘా విమానం ధ్వంసమైంది. సుమారు 700 మిలియన్ డాలర్లు(రూ.5,800 కోట్లు) విలువైన ఈ విమానం నాశనం కావడం అమెరికా వైమానిక దళానికి పెద్ద దెబ్బ. ఈ విమానం గగనతల నిఘాకు కీలకం కావడంతో, ముందుముందు అమెరికా దాడుల తీరు మారే అవకాశం ఉంది. దాడిలో 10–15 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయని సమాచారం.
ట్రంప్–మోదీ ఫోన్ కాల్.. మధ్యలో మస్క్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఎలాన్ మస్క్ కూడా పాల్గొనడం గమనార్హం. ఈ చర్చల్లో భారత్లో స్టార్లింక్ సేవల ప్రారంభానికి సంబంధించిన అనుమతులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్–అమెరికా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ కృషి, మధ్యవర్తిత్వంపై చర్చించారు. పాకిస్తాన్ 15 అంశాలతో ఇరాన్కు ప్రతిపాదనలు పంపినా, టెహ్రాన్ వాటిని తిరస్కరించిన నేపథ్యంలో భారత్ పాత్ర కీలకమైంది.
నిత్యావసర ధరల పెరుగుదల..
యుద్ధం కారణంగా భారత్లో నిత్యావసర సరకుల ధరలు పెరగడం ఆరంభమైంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. యుద్ధం కారణంగా ఎరువుల (ఫర్టిలైజర్స్) దిగుమతి ఆటంకాలు ఏర్పడ్డాయి. పంటలు, కూరగాయలు, ధాన్యంపై ప్రభావం పడుతోంది. భారత్ ఏటా 5–6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. రవాణా ఆటంకాలతో వీటి ధరలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.
ప్రస్తుత పరిణామాలు చూస్తే, పాకిస్తాన్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ట్రంప్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపినా, ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు, ఎరువుల కొరత భారత రైతులు, వినియోగదారులపై తీవ్ర భారం మోపనున్నాయి.