Iran US talks : “పాకిస్తాన్ ఎగిరి పడుతోంది అంటే ఏదో కారణమే ఉండి ఉంటుంది. కాకపోతే ఆ దేశానికి అంత సీన్ ఉందా.. అమెరికాకు గత్యంతరం లేదు. చైనా మధ్యవర్తి పాత్ర పోషించలేదు. భారతదేశానికి అవసరం లేదు. ఇంగ్లాండ్ ఆ సాహసం చేయలేదు. యూరోపియన్ యూనియన్ నిలబడలేదు.. అందువల్లే పుడింగిలాగా పాకిస్తాన్ వచ్చింది. కానీ, ఇరాన్ కు ఎక్కడో అపశకునం.. కాకపోతే తప్పదు కాబట్టి వచ్చింది. అయినప్పటికీ ఏం జరగలేదు. ఇకపై ఏం జరగదు కూడా”.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అయినప్పుడు.. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఓ విశ్లేషకుడు పంచుకున్న అభిప్రాయానికి అనువాదం అది.
పై అనువాదానికి.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే అమెరికా షరతులకు ఇరాన్ తల వంచదు. ఇరాన్ తన దేశంలో అమెరికా పెత్తనాన్ని ఒప్పుకోదు. మొత్తంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చలు ఆదిలోనే హంస పాదులాగా ముగిసిపోయాయి. మరో దఫా చర్చలు అంటున్నారు గానీ.. అవి కార్యరూపం దాల్చుతాయా.. లేదా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటికే హర్ముజ్ జల సంధి మీద పరోక్ష ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా పోటా పోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా జరగవచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇదంతా జరుగుతుండగానే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఒక కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా సెరెనా హోటల్ లో అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ హోటల్ బిల్లు తడిసి మోపెడు కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు జరిగే రొటీన్ ఖర్చులు మాత్రమే కాకుండా..ఇతర వాటిని కూడా పాకిస్తాన్ చెల్లించడంలో విఫలమైందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
“దేశంలో పెట్రోల్ లేదు. డీజిల్ దొరకడం లేదు. ఒక రకంగా కరోనా కాలం నాటి పరిస్థితి కంటే దారుణంగా ఉంది. ప్రజలకు కనీస అవసరాలు తీరే మార్గం కనిపించడం లేదు. దారుణమైన పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి. అసలు దేశంలో ఎన్నుకుంటున్నామో ప్రజలకే అర్థం కావడం లేదు. ప్రజలు చెల్లించిన పన్నులు దారి మల్లుతున్నాయి. ఇటువంటి స్థితిలో ఆదేశాన్ని ఆ భగవంతుడే కాపాడాలి. చివరికి హోటల్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. అసలు ఇలాంటి స్థితిలో మధ్యవర్తిత్వం ఎందుకు చేసినట్టు.. చేయాలని ఎవరు చెప్పినట్టు.. పాకిస్తాన్ ప్రతి సందర్భంలోనూ తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా తన పరువు తానే తీసుకుంటుందని” విశ్లేషకులు చెబుతున్నారు.
