తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు రెండు రోజుల పాటు సెలవులు రద్దు చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సాగుతాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు, అధికారులు శని, ఆదివారాలు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని సీఐజీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ఈరోజు రెండో శనివారం, రేపు ఆదివారం సెలవు దినాలు. అయితే రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరవుతారు. దీంతో ఈ రెండు రోజులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.