China underwater data centers : చైనాను మనం తిట్టిపోసుకుంటాం. ఆడిపోసుకుంటాం. అవసరమైతే చైనా అంత దూర్తదేశం లేదని విమర్శిస్తుంటాం. కానీ కొన్ని విషయాల్లో చైనా గొప్ప పనులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు ఉండే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. చైనా లేకపోతే ఆపిల్ కంపెనీ ఫోన్లను మనం కొనుగోలు చేసేవాళ్లం కాదు. చైనా ఆవిష్కరించకపోతే ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మనం కొనేవాళ్లం కాదు. ఎందుకంటే చైనా తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చూస్తుంది. మొదటినుంచి కూడా చైనా అనుసరించే విధానం ఇదే. అందువల్లే ప్రపంచ కర్మకారంగా చైనా దేశం వర్ధిల్లుతోంది.
ఇప్పటివరకు ఎలక్ట్రానిక్.. కెమికల్.. శాటిలైట్.. హెల్త్ కేర్.. టాయ్.. హోమ్ నీడ్స్ వంటి వాటిల్లో చైనా అమెరికాను మించిపోయే ప్రయోగాలు చేసింది. అందులో తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను రూపొందించి ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యంలో ముంచేసింది. ఫలితంగా ప్రపంచ దేశాలకు చైనా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మిగతా దేశాలు దిగుమతి చేసుకుంటుంటే.. చైనా మాత్రం దర్జాగా ఎగుమతులు చేస్తూ భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.
చైనా ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా చేసింది. దీనివల్ల యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డాటా చుట్టు తిరుగుతోంది. డాటా అనేది ప్రపంచానికి అనివార్యంగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా డాటాకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అందువల్లే అన్ని కంపెనీలు డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. డాటా సెంటర్లు ఏర్పాటు చేయాలంటే వాతావరణం అనుకూలంగా ఉండాలి. ప్రకృతి విపత్తులు చోటు చేసుకోకుండా ఉండాలి. స్థూలంగా చెప్పాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. డేటా సెంటర్ ఏర్పాటుకు భారీగా విద్యుత్ ఖర్చవుతుంది. ఉష్ణోగ్రత కూడా అధికంగా విడుదలవుతుంది. కొంతమేర అక్కడ ఉన్న ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. దీనిని గుర్తించిన చైనా.. ఏకంగా సముద్రం అడుగుభాగంలో డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల విద్యుత్ ఖర్చుతో పాటు.. ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు.. ఇప్పటికే సముద్రం అడుగు భాగంలో ఏర్పాటు చేసిన కేబుల్స్ ద్వారా ప్రపంచానికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గుతుంది.. నిర్వహణ భారం అంతగా ఉండదు. భూమి కేటాయింపులు చేయాల్సిన అవసరం లేదు. పైగా ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పటికీ ఈ డేటా సెంటర్లు పెద్దగా ప్రభావితం కావు.
చైనా చేసిన ఈ పని వల్ల ఇప్పుడు యావత్ ప్రపంచం ఆశ్చర్యం లో ఉంది. ముఖ్యంగా సముద్రాలను కలిగి ఉన్న దేశాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆయా దేశాలకు ఆదాయం వస్తుంది. దీనికి తోడు నిర్వహణ ఖర్చు ఉండదు. ఉపాధి కూడా లభిస్తుంది. భూ కేటాయింపులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి.. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.