తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం చర్చ అంతా కూడా అధికార మార్పు పైనే. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆ తారక మంత్రాన్నే జరిపస్తున్నారు. కాబోయే సీఎం అంటూ మాట్లాడుతున్నారు. కొందరైతే ఏకంగా వేదికల మీదనే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒకరినొకరు పోటీపడి మరీ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా నాయకుడి మెప్పు పొందడానికా..? లేదా ఇంకా ఏదైనా కారణమా..? తెలియదు కానీ ఈ మధ్య ఈ ప్రచారం మాత్రం మరింత ఊపందుకుంది.
Also Read: జగన్ సర్కార్ కు మళ్లీ షాకిచ్చిన నిమ్మగడ్డ
అంతేకాదు.. ఫిబ్రవరిలోనే పట్టాభిషేకం అని కూడా అంటున్నారు. అయితే.. కొంత మంది మాత్రం దీన్ని నమ్మడం లేదు. కేసీఆర్ పదవి వదిలి పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే మాట చెబుతున్నారు. కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని.. కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్ను సీఎం చేయరని జోస్యం చెప్పారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు.. కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అంటున్నారని విశ్లేషించారు.
మరోవైపు.. కేటీఆర్ను సీఎం చేస్తారని బీజేపీ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నా కేసీఆర్ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన కొంత మంది మాత్రం నమ్మడం లేదు. ఇప్పుడు కాదు.. నాలుగేళ్ల నుంచి కేటీఆర్కు సీఎం పీఠం అనే ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికల్లాంటి పరిస్థితులు వచ్చినా అది గెలవగానే కేటీఆర్కు పీఠం అన్న ప్రచారం చేశారు. కానీ.. ఎప్పుడూ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఓటమి బాటల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారం చేస్తున్నారు.
Also Read: కాపులకు కాపులే శత్రువులా? .. కాపు సంక్షేమ సేన, పవన్ ల కథేంటి?
ఇప్పుడు కనుక సీఎంను మారిస్తే.. రాజకీయంగానూ టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ రిస్క్ తీసుకోరని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అదే కారణం అని భావిస్తున్నారు. కేటీఆర్ను సీఎం చేసేదాకా.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. నాయకత్వం మార్పుపై ప్రచారం తప్పితే ఇప్పటివరకు అయితే నిజమైన పరిస్థితులైతే లేవు. ఈసారైనా ఈ ప్రచారం నిజం అవుతుందా చూడాలి మరి. లేకుంటే రేవంత్ చెప్పిన జోస్యమే నిజం అవుతుందా తెలియదు..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్