Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యువ అర్చకుడు!

ఇదిలా ఉండగా ఈనెల 22న నిర్వహించే అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లే భక్తులతోపాటు తర్వాత కూడా అయోధ రాముని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.

Written By: Raj Shekar, Updated On : January 18, 2024 8:20 pm
Follow us on

Ayodhya Ram Mandir : భారతీయుల 500 ఏళ్లనాటి కల మరో నాలుగు రోజుల్లో నెరవేరబోతోంది. అయోధ్యలో నిర్మించిన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 7 వేల మందికి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపించింది. ఇక ఈనెల 16 నుంచి అయోధ్యలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. రామాలయంలో అర్చకుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. ఇందులో తిరుపతిలోని వెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీలో వేది విద్య అభ్యసిస్తున్న మోహిత్‌ పాండే అయోధ్య రామాలయ అర్చకుడిగా ఎంపికయ్యారు.

గజియాబాద్‌ బ్రాహ్మణుడు..
మోహిత్‌ పాండే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గజియాబాద్‌కు చెందిన బ్రాహ్మణుడు. అయోధ్య రామాలయ అర్చకుల కోసం నిర్వహించిన ఎంపిక కోసం దేశవ్యాప్తంగా 3 వేల మంది పోటీపడ్డారు. అందులో మోహిత్‌పాండే ఒకరు. శ్రీరాముడికి సేవకుడిగా, అయోధ్య రామమందిరంలో పూజారిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆరు నెలల ప్రత్యేక శిక్షణలో ఉన్నారు. జనవరి 22న రామాలయంలో నిర్వహించే మహా కతృవులో మోహిత్‌పాండే జాయిన్‌ అవుతారని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది.

అయోధ్య వెళ్లేవారికి ప్రత్యేక యాప్‌..
ఇదిలా ఉండగా ఈనెల 22న నిర్వహించే అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లే భక్తులతోపాటు తర్వాత కూడా అయోధ రాముని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దివ్య్‌ అయోధ్య యాప్‌ను రిలీజ్‌ చేసింది. ఈ యాప్‌లో రామాలయం గురించిన విశేషాలు, అయోధ్యలో తప్పక దర్శించుకోవాల్సిన దేవాలయాలతోపాటు హోటళ్లు, హోం స్టే, ఈ బస్, గైడ్‌లను బుక్‌ చేసుకునే సౌకర్యం ఈ యాప్‌లో ఉంది. ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో, యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ అయోధ్య వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.