ఎక్కడైనా సామాన్య ప్రజలు.. లేదంటే పార్టీలోని చిన్నపాటి క్యాడర్ వర్గపోరులో ఇరుక్కుపోయిందంటే అదో అర్థం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలో వర్గపోరు అంటే బాగుంటుంది. కానీ.. ఏపీలో అధికార వైసీపీలోనే వర్గపోరు నెలకొనడం మింగుడు పడని అంశం. ఏపీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ వర్గపోరులో నలిగిపోతున్నారు. సురేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక్కడ గెలవడం గెలిచారు కానీ.. అక్కడ పట్టుమని పది రోజులు కూడా ఉండడం లేదట.
సురేశ్ గెలిచినప్పటి నుంచి విజయవాడలోనో.. లేకుంటే హైదరాబాద్లోనో.. అక్కడా కాకుంటే తిరుపతిలోనో మకాం పెడుతున్నారట. ఫలితంగా ఆయన్ను గెలిపించిన నాయకులు, పార్టీ క్యాడర్ను ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలుకు, మంత్రికి మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి సురేశ్ చిన్నపాటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినా కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఏడాదిగా ఇదే తంతు నడుస్తుండడంతో ఇప్పుడు నియోజకవర్గంలోని క్యాడర్లో చీలికలు వచ్చాయి. ఎస్సీ వర్గంలోనే రెండుగా చీలిపోయాయి. ఇప్పుడు ఏకంగా మంత్రి వ్యతిరేకంగా చక్రం తిప్పేందుకు రెడీ అయిపోయారు.
వీరిలో ఓ వర్గం అయితే ఏకంగా వచ్చే ఎన్నికల్లో సురేశ్ను ఓడించేందుకు కృషి చేస్తామని అంతర్గతంగా ప్రకటనలు చేస్తుండడం సంచలనం రేపుతోంది. సురేశ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ కులానికో నేతను పెట్టుకుని.. వారితోనే పనులు కొనసాగిస్తున్నారు. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యింది. ఇక మరో వర్గం ఏకంగా స్థానిక మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తోంది. ఎస్సీలను పట్టించుకోని ఎస్సీ నాయకుడు, మంత్రి అయ్యాక.. మరిచిపోయిన నేత.. అంటూ.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. ఇలాంటి ప్రచారం ఇప్పుడేం కొత్త కాదు.. ఆరు మాసాలుగా కొనసాగుతోంది. అయినా మంత్రి మాత్రం ఎవరినీ లెక్కచేయడం లేదు.
ఆ మంత్రి ఇప్పటివరకు తాను గెలిచిన నియోజకవర్గాన్ని సైతం పెద్దగా నమ్ముకున్నట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే మరో నియోజకవర్గం నుంచైనా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆయన మంత్రి కాబట్టి ఒక్క నియోజకవర్గం అన్నట్లుగా పనిచేయకుండా రాష్ట్రం మొత్తాన్ని బాగోగులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన లోకల్ లీడర్లను.. లోకల్ రాజకీయాలను పట్టించుకోవడం లేదనేది సమాచారం.