YCP Govt- Teachers: ఉపాధ్యాయులపై వైసీపీ కీలక నిర్ణయం.. అందుకేనా?

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. 3 4 5 తరగతుల ను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారని, దీనివల్ల ఉపాధ్యాయులు పోస్టులు రద్దవుతాయని చెబుతున్నారు.

Written By: SHAIK SADIQ, Updated On : May 6, 2023 2:54 pm
Follow us on

YCP Govt- Teachers: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఒక్కో వర్గాన్ని ‘మంచి’ చేసుకుంటూ వెళ్తున్న వైసీపీ సర్కార్ ఈ సారి ఉపాధ్యాయులపై దృష్టి పెట్టింది. పని భారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తమకు అన్యాయం జరుగుతుందని గళమెత్తిన ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉన్నారు. రాబోవు ఎన్నికల్లో తమ తడాఖా చేపనున్నట్లు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించడం హాట్ టాపిగ్గా మారింది.

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. 3 4 5 తరగతుల ను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారని, దీనివల్ల ఉపాధ్యాయులు పోస్టులు రద్దవుతాయని చెబుతున్నారు. అంతేగాక, ప్రాథమిక పాఠశాలల ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విడతల వారీగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహిస్తూ, వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోతున్నామని, విరమించుకోవాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.

అలాగే, ఉపాధ్యాయులకు బోధన కంటే వివిధ యాప్ ల ద్వారా అప్ లోడింగ్ చేసే ఫొటోలతో పనిభారం ఎక్కువైంది. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, విద్యార్థుల సంఖ్య వంటి బోధనేతర పనులను ప్రభుత్వం అప్పగించింది. సర్వర్ రాక ఈ పనుల కోసం ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. బాత్రూంల దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బోత్స సత్యనారాయణ చర్చల అనంతరం పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని ఊరటనిచ్చే ప్రకటన చేశారు. యాప్ ల పని ఉంటుందని, కానీ పని భారం తగ్గిస్తామని అన్నారు. టీచర్ల సమయం ఎక్కువగా బోధనకు కేటాయించేలా చేస్తామని అన్నారు. అలాగే, వివాదాంశంగా మారిన జీవో 117 విషయంలోను ఆయన సానుకూలంగా స్పందించారు. బదిలీలు ఎలా జరగాలో టీచర్లకే అప్పగిస్తామని, సూచనల మేరకే చేస్తామని చెప్పుకొచ్చారు.

కాగా, ఉన్నట్టుండి ఉపాధ్యాయులపై ప్రేమ పుట్టుకురావడం పలువురు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకు పలు ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం టీచర్లు ఎలా చెబితే అలా నడుచుకుంటామని మంత్రి అనడంపై వ్యూహాత్మకమేనని పలు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. రాబోవు ఎన్నికల్లో టీచర్ల ఓట్లు కీలకం. ఆ మేరకు మంచి చేసుకుంటూ మేలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.