2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించేశారు. దీంతో అక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రధానంగా గుంటూరు, విజయవాడల మధ్య ఉన్న భూమి బంగారమయిపోయింది. దీంతో గజం ధర యాభై వేలకు పైగానే పలికింది. ఎప్పుడూ లేనివిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లను వేశాయి. జాతీయ రహదారికి ఇరువైపు విజయవాడ–గుంటూరు మధ్య ఎన్నో అపార్ట్ మెంట్లు వెలిశాయి.
Also Read: బాబు ఎమోషనల్.. నన్ను కూడా చంపేయండి
అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఇక్కడ ధరలు ఢమాల్ అన్నాయి. పూర్తిగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలు తగ్గించి ఆఫర్లు ప్రకటించినా కొనేవారు లేరు. దీంతో అనేక అపార్ట్ మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాదాపు పద్నాలుగు నెలలుగా ఎటువంటి బేరాల్లేవని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. తాము బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పునకు వడ్డీ కూడా చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. కొద్దినెలలుగా ఇక్కడ క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. 2020 సంవత్సరంలో అయితే ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకవైపు మూడు రాజధానుల ప్రకటన, మరోవైపు కోవిడ్ తో పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తమ భూములు బంగారమని, అమ్ముకోకుండా ఉంచుకున్న వాళ్లు నేడు లబోదిబోమంటున్నారు.
Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?
వీటికితోడు.. తాజాగా ప్రభుత్వం అమరావతి నుంచి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు మూడు నెలల్లోనే రాజధాని తరలిపోతుందని వైసీపీ ముఖ్యనేతలే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో భూముల ధరలు మరింత దిగజారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యాభై వేలు పైచిలుకు పలికిన గజం ధర ఇప్పడు 14 వేలకు ఇస్తామన్నా కొనే వారు లేరు. రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా వెలవెలబోతున్నాయి. మొత్తం మీద అమరావతి ప్రాంతంలో కొత్త ఏడాది కూడా రియల్ బిజినెస్ పుంజుకునే పరిస్థితులైతే కనిపించడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్