ఈ సంవత్సరం రాష్ట్రంలో యాసంగి పంట రికార్డ్ స్థాయిలో పండింది. అయితే, కరోనా కారణంగా కొనుగోళ్లపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలుచేసినా ఏ నెలకో.. రెండు నెలలకో డబ్బులు చేతికొస్తాయని రైతులు భయపడ్డారు. కానీ, పంటను అమ్ముకున్న వారంలోపే ఖాతాల్లో సొమ్ము జమకావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఒకవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మరోవైపు అన్నదాతల్లో సంతోషాన్ని నింపుతున్నది. ధాన్యం ఏ-గ్రేడ్కు రూ.1,835, బీ-గ్రేడ్ కు రూ.1,815 మద్దతుధర చెల్లిస్తూ ప్రభుత్వం కొనుగోలుచేస్తున్నది.వరికి ఈస్థాయిలో మద్దతు ధర గతంలో ఎన్నడూ దక్కిన దాఖలాలు లేవు.
గ్రామాల్లో రైతులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పండిన ప్రతిగింజనూ కోనుగోలు చేస్తామని ప్రకటించినట్టుగానే పల్లెల్లో పంట కొనుగోళ్లు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతేవేగంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమవుతున్నది.
పంట కొనుగోళ్లలో ఆన్ లైన్ వ్యవస్థను అనుసంధానం చేసి ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ట్యాబ్ లను అందజేసిన పౌరసరఫరాల అధికారులు.. ఇందుకోసం బుక్ కీపర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రైతు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చాక తూకం వేయగానే నిర్వాహకులు ట్యాబ్ లో యూజర్ ఐడీని నమోదుచేసి లాగిన్ అవుతారు. ఆన్ లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లయ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రైతుపేరు, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు, పట్టాపాసు పుస్తకం వివరాలు నమోదుచేస్తారు. రైతు ధాన్యం వివరాలను పొందుపరుస్తారు. వెంటనే ఆ వివరాలు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కు వెళ్తాయి. అక్కడి నుంచి మద్దతు ధర ప్రకారం రైతు ఖాతాలో డబ్బులు జమవుతాయి. ధాన్యం తూకం వేయడం, తేమశాతం నిర్ధారించడం, సంచులు కుట్టడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో నిర్వాహకులు ప్రశంసలందుకుంటున్నారు.