Minister Appalaraju
Minister Appalaraju: వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చవద్దు.. అర్హులను జాబితాల నుంచి తొలగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేస్తోంది. అయినా సరే ఎక్కడికక్కడే ఓటరు జాబితాలో తప్పులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో అధికార పక్షం కుటిల యత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలుత జనసేన సోషల్ మీడియా గ్రూపులో మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. తరువాత సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది.
ఇటీవల పలాసలో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఎన్నికలకు బూత్ లెవెల్ నాయకులు తక్షణమే సమాయత్తం కావాలి. బూత్ కన్వీనర్ చేతిలో ఓటర్ లిస్ట్ ఉండాలి. ఎవడు. ఎక్కడుంటాడు? మనకు ఓటేస్తాడా? మనకు వేయడా? మాట్లాడితే మనకు ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? అవి న్యూట్రల్ ఓట్లా? మనకు పడతాయా లేదా? తెలుసుకోండి.ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి ఓట్లు మనకు పడితే ఒక లెక్క.. పడకపోతే మరో లెక్క అన్నట్టుగా వ్యవహరించండి. మనవి కానీ ఓట్ల పై నిరభ్యంతరంగా అభ్యంతరాలు వ్యక్తం చేయండి. తొలగించేదాకా పట్టు పట్టండి’.. అంటూ మంత్రి సీదిరి వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగని మంత్రి అప్పలరాజు పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు. మన ఓట్లు అనుకుంటే. మనవి కాదనుకుంటే మాత్రం టిక్కులు పెట్టేయండి. మనం పిలిస్తే రాకుండా.. విపక్షాలు పిలిస్తే వచ్చే వలస ఓటర్ల ఓట్లు విషయంలో అభ్యంతరం చెప్పండి. అవసరమైతే ఫారం7 నెంబర్ నింపండి అంటూ మంత్రి అప్పలరాజు సూచించారు. ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికలు మామూలుగా జరగవని విపక్షాలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకు తగ్గ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు జరుగుతాయని అనుమానం పడ్డాయి. అందుకు తగ్గట్టే ఒకే చిరునామాతో వందలాది ఓట్లు నమోదు కావడం విశేషం. ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇవ్వడం.. ఈ విషయంలో అధికార పార్టీ ఏ స్థాయిలో ఆలోచిస్తుందో అర్థమవుతోంది.