సిద్ధూ రాజీనామాతో కాంగ్రెస్ కు లాభమా..? నష్టమా..?

‘సిక్సర్ల సిద్దూ’ కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చుతాడని పీసీసీ పగ్గాలు అప్పగిస్తే..రెండు రోజులకే హిట్ వికెట్ గా మారి వెనుదిరిగాడు. అసంతృప్తితో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసేశారు. అటు సిద్దూపై నమ్మకంతో పంజాబ్ కాంగ్రెస్ సీఎంను సైతం మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకున్న చందంగా మారింది.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని చావుదెబ్బతీస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ తన పదవికి […]

Written By: NARESH, Updated On : October 2, 2021 8:45 am
Follow us on

‘సిక్సర్ల సిద్దూ’ కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చుతాడని పీసీసీ పగ్గాలు అప్పగిస్తే..రెండు రోజులకే హిట్ వికెట్ గా మారి వెనుదిరిగాడు. అసంతృప్తితో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసేశారు. అటు సిద్దూపై నమ్మకంతో పంజాబ్ కాంగ్రెస్ సీఎంను సైతం మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకున్న చందంగా మారింది.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని చావుదెబ్బతీస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత కాంగ్రెస్ చరణ్ జిత్ సింగ్ చన్నీ పేరు ప్రకటించింది. దీంతో సీఎం సీట్లో చన్నీ కూర్చున్నారు. అయితే అప్పటి వరకు సిద్ధూ ముఖ్యమంత్రి అవుతాడని భావించారు. కానీ అనూహ్యంగా చన్నీ పేరు ప్రకటించడంతో కలకలం రేపింది. అయితే చన్నీ సీఎం కావడం సిద్ధూకు ఇష్టమే అయినా కొన్ని రోజుల తరువాత ఒక్కాసారిగా తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మాజీ సీఎం అమరీందర్ సింగ్ విషయంలోనూ సిద్ధూ ఇలాగే ప్రవర్తించారు. ఈ ఏడాది జూలైలో పార్టీ అధ్యక్షుడిగా నియామకం అయిన తరువాత సిద్ధూ, సీఎం అమరిందర్ సింగ్ ల మధ్య పోరు సాగుతూనే ఉంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అమరీందర్ సింగ్ విఫలమయ్యాడని సిద్ధూ ఆరోపించారు. కొందరు నాయకులు సైతం సీఎం నిర్ణయాలపై వ్యతిరేకంగా మాట్లాడడంతో ముఖ్యమంత్రి మార్పు కావాలనే డిమాండ్ ఏర్పడింది. దీంతో అమరీందర్ సింగ్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి తాను సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు.

అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి సీటు నుంచి తప్పుకున్న తరువాత మాఝూ ప్రాంతం నుంచి త్రిపాత్ రజిందర్ సింగ్ బజ్వా ఎమ్మెల్యేలను సమీకరించారు. అంతా కలిసి సిద్ధూకు మద్దతు తెలిపారు. ఒక దశలో సిద్ధూయే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం చరణ్ జిత్ పేరును ప్రతిపాదించింది. దీంతో తొలి దళిత సీఎంగా చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మూడింట ఒక వంతు దళితులు ఉన్నారు. దీంతో వారి నుంచి లాభం పొందేందుకే చన్నీని సీఎం చేసినట్లుగా చర్చించుకుంటున్నారు.

అయితే సీఎం సీట్లోకి రాగానే చన్నీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. కేబినేట్లోనూ తనకు అనుకూలంగా ఉండేవారిని మంత్రులను చేశారు. వీరిలో ఒక్కరు కూడా సిద్ధూ వర్గానికి చెందిన వారు లేకపోవడం గమనార్హం. దీంతో కేబినెట్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు పోలీసు శాఖల్లోనూ సిద్ధూ చెప్పిన వారికి పదవులు ఇవ్వలేదని సిద్ధూ నిరసన తెలిపారు. దీంతో తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

సిద్ధూ రాజీనామాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కు సిద్ధూ అవసరం ఉందని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించాలని అంటున్నారు. అయితే తన ప్రసంగాలతో జనాలను ఆకర్షించడంలో సిద్ధూకు ప్రత్యేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో సిద్ధూ అవసరం తప్పక ఉంటుందని అంటున్నారు. అయితే ఆయన కొద్ది కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగారు.. కానీ ఆ స్థానాన్ని కాపాడుకోలేకపోయారు అని పార్టీలోని ముఖ్యులు అంటున్నారు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయన భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

సిద్ధూను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన వల్ల పార్టీకి పెద్దగా లాభం చేకూరకపోయినా.. లేవ నెత్తిన సమస్యలను మాత్రం పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. లేకుంటే దీనిని ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సిద్ధూను బుజ్జగించి పార్టీలోనే ఉంచడం వల్ల లాభం చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో సంక్షోభం నెలకొన్న సమయంలో సమస్యను మరింత పెద్దదిగా చేయడం వల్ల నష్టం ఏర్పడవచ్చని అంటున్నారు.