Etela Rajender- Revanth Reddy: అటు ఈటెల.. ఇటు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ఓడిస్తారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Written By: Raj Shekar, Updated On : October 26, 2023 1:47 pm

Etela Rajender- Revanth Reddy

Follow us on

Etela Rajender- Revanth Reddy: ఆరు నూరైనా తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ దూకుడు పెంచుతోంది. ఇన్నాళ్లూ కుమ్ములాటలతో సతమతమైన పార్టీలో ఇప్పుడు ఐక్యత కనిపిస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు నేతలంతా సమష్టిగా శ్రమిస్తున్నారు. అభ్యర్థులను కూడా ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే నేతలకు టికెట్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను కూడా ఓడించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు. గెలుపు కూడా తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి సై అంటున్నారు.

సానుకూలంగా సర్వేలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎపుడైతే.. కర్ణాటకలో బీజేపీ గద్దె దిగి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతేకాదు తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలిగించి కిషన్‌రెడ్డిని తొలిగించడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. మళ్లీ తమకు అధికారం వస్తుందని.. రావాలని ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. నాయకులు కూడా అదే ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు తమ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నాయి.

రెడీ అంటున్న రేవంత్‌..
బీజేపీ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తోన్న గజ్వేల్‌ నుంచి అనూహ్యంగా ఈటల రాజేందర్‌ను రంగంలోకి దింపి బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదన్న సంకేతం ఇచ్చింది. గజ్వేల్‌లో సీఎంపై బీసీ కార్డు ప్రయోగించింది. మరోవైపు కేటీఆర్‌పై పోటీగా రాణిరుద్రమ నిలిపింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సైతం రేవంత్‌రెడ్డిని కేసీఆర్‌పై పోటీకి దించాలనే యోచనలో ఉంది. గతంలో రేవంత్‌ సీఎంపై పోటీ చేస్తానని చెప్పినా.. చివరకు తన నియోజకవర్గం కోడంగల్‌ నుంచే బరిలో దిగుతున్నారు. ఇక ఈటల గజ్వేల్‌లో పోటీతో అక్కడ పోటీ రంజుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డిని పోటీకి దింపాలనే ఆలోచనల్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దిపేటలో హరీశ్‌రావుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దింపాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. సిరిసిల్లలో కేటీఆర్‌పై ఉత్తమ కుమార్‌రెడ్డిని పోలీ చేయించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.