andhra jyothy rk : మనకు అనుకూలంగా ఉంటే ప్రతిదీ కూడా సానుకూలంగానే కనిపిస్తుంది. అదే వ్యతిరేకంగా ఉంటే అన్నింట్లోనూ లోపమే దర్శనమిస్తుంది. గతంలో ఇటువంటి విధానాన్ని రాజకీయ నాయకులు మాత్రమే పాటించేవారు. కానీ ఇప్పుడు మీడియా అతిథులు కూడా దీనిని ఒంట పట్టించుకున్నారు. పైగా తమకంటూ సొంత మీడియా సంస్థలు ఉండడంతో ఇష్టానుసారంగా సుభాషితాలు చెబుతూనే ఉన్నారు. వినేవాడు వెర్రి నాగన్న అయితే.. చెప్పేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు.
తెలుగులో సుప్రసిద్ధ పాత్రికేయులలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ ఒకరు. మిగతా వారి మాదిరిగా ఈయన రాతలు షుగర్ కోటెడ్ లాగా ఉండవు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో కుండ బద్దలు కొట్టినట్టుగానే ఉంటాయి. అందువల్లే రాధాకృష్ణను చాలామంది అభిమానిస్తుంటారు. అదే స్థాయిలో ద్వేషిస్తూనే ఉంటారు.
ప్రభుత్వాలతో.. ఎంతమంది నాయకులతో రాధాకృష్ణ నిత్యం వాదులాట పెట్టుకుంటూనే ఉంటారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే జగదీష్ రెడ్డి వరకు అందరితోను రాధాకృష్ణకు ఇదే వరుస. ఇక ఏపీలో అయితే జగన్ అంటే రాధాకృష్ణకు విపరీతమైన కోపం. అందువల్ల తన పత్రికలో ఏనాడు కూడా జగన్ మీద సానుకూలంగా సింగిల్ కాలం వార్త కూడా ప్రచురించే సాహసం చేయడు రాధాకృష్ణ. ఇక తన ఛానల్లో చేసే ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో బిఆర్ నాయుడు వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు . బి.ఆర్ నాయుడు వీడియో ఆయన వ్యక్తిగతమని రాధాకృష్ణ పేర్కొన్నారు. అంతేకాదు బిఆర్ నాయుడు పై తనకు కోపం లేదని.. అసలు అటువంటి వ్యవహార శైలి కూడా తనది కాదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఏ పదవి కూడా తను ఆశించలేదని.. చంద్రబాబు దగ్గర నేను స్వతంత్రంగా ఉంటానని రాధాకృష్ణ చెప్పుకోచ్చారు.
కానీ ఇదే రాధాకృష్ణ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం నిర్మించే సముదాయాల గురించి తన పత్రికలో ఎటువంటి వార్తలు రాశారు.. గతంలో బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో వెలువడిన ఒక హెయిర్ ఆయిల్ గురించి ఎటువంటి కథనాలు రాశారు.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ గురించి ఎటువంటి కథనాలు రాశారు.. ఇటీవల బిఆర్ నాయుడు వీడియో బయటపడినప్పుడు ఎటువంటి కథనాలను ప్రసారం చేశారు.. ఇవన్నీ ప్రజలకు గుర్తుకే ఉన్నాయి. తను ఎవరికీ సబర్డినేట్ కాదని రాధాకృష్ణ చెప్పుకోవచ్చు. కానీ ఆయన సంధించిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకోలేనంత పిచ్చివాళ్లు తెలుగు పాఠకులు అసలు కాదు.