Ponguleti Srinivas Reddy Controversy: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గులాబీ పార్టీ నేతలు వెంబడిస్తున్నారు. వదల బొమ్మాలి అన్నట్టుగా ఆయన గురించి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే శ్రీనివాసరెడ్డి కుమార్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ఆయన సింగపూర్ నుంచి నిషేధిత వస్తువులను దిగుమతి చేసుకున్నారని విమర్శలు వినిపించాయి.
ఈ సంఘటన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద గులాబీ పార్టీ తీవ్రంగా దృష్టి సారించింది. అప్పట్లో ఆయన కంపెనీల మీద ఐటి అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ తీవ్రంగా ప్రచారం చేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముసలం తెస్తున్నారని ఆరోపణలు చేసింది. సరిగ్గా దీపావళికి ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ నేతల అక్రమాలకు సంబంధించి ఆటం బాంబులు పేలబోతున్నాయని హెచ్చరించారు. అయితే పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తగ్గట్టుగా సంచలన వ్యవహారాలు ఏవీ వెలుగులోకి రాలేదు.
ఇక ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక కీలక విషయాన్ని గులాబీ నేతలు బయటికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా కంకర క్రషింగ్ చేపడుతోందని ఆరోపించారు. గులాబీ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్రిశాంక్ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న క్రషర్ వద్దకు వెళ్లారు. కొండలను మొత్తం పొంగులేటి కంపెనీ పిండి చేస్తోందని మండిపడ్డారు.
గులాబీ నేతల ఆరోపణల నేపథ్యంలో పొంగులేటి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రాఘవ కంపెనీ వివరణ ఇచ్చింది. తాము నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పనీ చేయడం లేదని పేర్కొంది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే క్రషర్ నిర్వహిస్తున్నామని పేర్కొంది. గులాబీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని.. ఆ విమర్శలు మొత్తం సత్య దూరమని స్పష్టం చేసింది. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.
