2014లో పార్లమెంట్ లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 గా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 134 గా పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఎన్డీఏ తొలి దశలో విభజన హామీల అమల్లో భాగంగా పలుమార్లు న్యాయశాఖతో చర్చలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం సాధ్యం కాదని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయశాఖ అప్పట్లోనే వివరణ ఇచ్చింది.
రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది 2026 తరువాత జరిగే జనాభా లెక్కల అనంతరమే సాధ్యమవుతుందని తెలుస్తోంది. ఈరోజు లోక్ సభలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. 2031 జనాభా లెక్కల తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు.
2024, 2029 ఎన్నికల నాటికి రెండు స్టేట్లలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పార్లమెంట్ స్థానాల్లో రెండు స్టేట్లకు సభ్యుల సంఖ్య బాగానే ఉంది. దీంతో ఇరు ప్రాంతాలు సీట్లపై కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుందని భావించినా ఫలితం దక్కదని తెలుస్తోంది. 2031 వరకు సీట్ల పెంపుపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు.