Vangaveeti Ranga: వంగవీటి మోహన్ రంగా .. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వంగవీటి మోహన్ రంగా ఎదిగారు. వారికి అండగా నిలబడ్డారు. విజయవాడ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు.విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ యవనికపై అడుగు పెట్టారు. విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో కూర్చున్నారు. ఆ సమయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడులు, ప్రతి దాడులతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. రంగాను చంపింది టిడిపి వారేనని.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ అదే తరహా ఆరోపణలు కొనసాగుతున్నాయి. చంపించింది టిడిపి వారేనని ఆరోపణలు వచ్చినా.. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ సొంత పార్టీ నేత హత్యపై ఎటువంటి విచారణలు జరపలేదు. నిందితులను శిక్షించలేదు. కానీ నాటి మరక టిడిపిని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాన్ని వేధిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వంగవీటి మోహన్ రంగ 1988లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు యాక్టివ్ గా పని చేస్తున్నారు. అప్పట్లో విజయవాడలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలోనే రంగా హత్యకు గురయ్యారు. కానీ అనుమానితుల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్నది ఒక ప్రధాన ఆరోపణ. హత్యరోపణలు ఎదుర్కొంటున్న వారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సహజంగానే ఆ పార్టీపై అనుమానం ఉంటుంది. నాటి ఘటన ఎన్టీఆర్ కు తెలుసునని.. చంద్రబాబు ప్రోత్సాహం ఉందని తాజాగా నాదెండ్ల భాస్కరరావు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక వైసీపీ హస్తం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. జనసేనలో నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు పవన్ కు పవర్ షేరింగ్ కావాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాదెండ్ల భాస్కరరావు మాట్లాడిన వీడియో వైరల్ చేస్తుండడం విశేషం. అయితే గతంలో ఎప్పుడో నాదేండ్ల భాస్కరరావు ఇంటర్వ్యూలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దానిని ఇప్పుడు వైసిపి ట్రోల్ చేయడం విశేషం. టిడిపి, జనసేన మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదని.. కాపులను డిఫెన్స్ లో పెట్టాలని.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
— Anitha Reddy (@Anithareddyatp) December 26, 2023