కన్నడ బీజేపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో.. కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. ఆశావహులు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరిని సీఎం సీటుమీద కూర్చోబెట్టాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్, కన్నడ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించారు. దీంతో.. ఎవరిని ఫైనల్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఈ విషయమై కర్నాటక బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని నేతలందరితో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు. అయితే.. ఇదంతా కేవలం ఫార్మాలిటీ చర్చలే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయమై బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, కానీ.. అసంతృప్తులు రాకుండా ఉండేందుకే ఈ చర్చల కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సీటుపై కూర్చునేందుకు తహతహలాడుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. కర్నాటక హోం మంత్రిగా ఉన్న బసవరాజ్ బొమ్మయ్, గనుల శాఖ మంత్రి మురగేష్ నిర్వాణి, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది, మరో డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అంతేకాకుండా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, స్పీకర్ విశ్వేశ్వర కాగేరితోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్నాటక బీజేపీ నేత బీఎల్ సంతోష్ కూడా ఉన్నారు.
వీరంతా ఎవరికి వారు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిని సంప్రదించకుండా హైకమాండ్ ఏకపక్షంగా ముఖ్యమంత్రిని ప్రకటిస్తే.. నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావించిన అధిష్టానం.. కర్నాటకలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం మొదలు పెట్టిందని అంటున్నారు. అయితే.. వీరిలో.. బీఎల్ సంతోష్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో వాస్తవం ఎంత? ఎవరు కొత్త సీఎం అవుతారు? అన్నది మరో రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది.