Homeజాతీయ వార్తలుVande India Train: వందే భారత్‌కు ఏమైంది.. ఎందుకలా లాక్కెళ్తున్నారు. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ!

Vande India Train: వందే భారత్‌కు ఏమైంది.. ఎందుకలా లాక్కెళ్తున్నారు. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ!

Vande India Train:  వందేభారత్‌.. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతమ్మకంగా తీసుకున్న రైల్వే ప్రాజెక్టు. మేకిన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఈ వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు పెట్టాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే.. వందేభారత్‌పై కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చార్జీలు అధికంగా ఉండడంతో మధ్య తరగతికి అందుబాటులో ఉండడం లేదు. చాలా స్టేషన్లలో హాల్టింగ్‌ ఇవ్వడం లేదు. దీంతో మధ్య తరగతి ప్రజలను రైలు ప్రయాణానికి కేంద్రం దూరం చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వీడియోలు..
ఇక ఈ వందేభారత్‌ రైళ్లకు సబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. గేదెను ఢీకొంటేనే రైళ్ల ఇంజిన్‌ సొట్టబడిపోవడం, రైలు ఆగిపోవడం వంటి ఫొటోలు అనేకం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఇటీవల వందేభారత్‌రైలులో నీళ్లు ఉరుస్తున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాజాగా మరో వీడియో చెక్కర్లు కొడుతోంది. పాత రైలు ఇంజిన్‌తో వందే భారత్‌ను లాక్కెళుతున్న వీడియో వైరల్‌గా మారింది.

నిత్యం వార్తల్లో..
నిత్యం ఏదో ఒక విషయంలో వందే భారత్‌ రైలు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వందే భారత్‌ రైలు మొరాయించడంతో ఓ ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ తీసుకెళుతున్నట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్‌ రైళ్ల వాస్తవ పరిస్థితి ఇదీ అంటూ కొందరు షేర్‌ చేస్తున్నారు. దీనిపై రైల్వే శాఖ స్పందించి అసలు విషయాన్ని బయటపెట్టింది.

25 సెకన్ల వీడియో..
వందే భారత్‌ రైలును ఓ పాత ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ లాగుతున్న 25 సెకన్ల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్లిప్పింగ్‌ను చాలా మంది షేర్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత కృష్ణ సైతం ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘9 ఏళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళుతోంది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. మరికొందరు సైతం ‘హైస్పీడ్‌ రైళ్లంటూ ఊదరగొట్టారు. చివరికి కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన ఇంజిన్లే దిక్కయ్యాయంటూ’ ట్వీట్‌ చేశారు. దీంతో వాస్తవమేంటో తెలీని కొందరు సైతం నిజమేననుకుంటూ ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు.

రైల్వే శాఖ వివరణ..
ఈ వైరల్‌ వీడియోపై ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే స్పందించింది. అది ఇంకా ప్రారంభానికి నోచుకోని వందే భారత్‌ రైలు అని తెలిపింది. రూట్‌ కూడా ఖరారు కాలేదని, ఒకసారి రూట్‌ ఖరారు అయ్యాకనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపింది. వాస్తవానికి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శశంక్‌ జైశ్వాల్‌ అనే వ్యక్తి సకల్‌ దిహా రైల్వేస్టేషన్‌సమీపంలో ఇటీవల ఈ వీడియోను రికార్డు చేశాడట. చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి పట్నా తరలిస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. అందులో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ లేరని పేర్కొన్నప్పటికీ.. కేవలం వీడియోను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసి కొందరు తమదైన కామెంట్లు జోడించడంతో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular