CJI Justice NV Ramana: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట తప్పడు.. మడప తిప్పడు అనే ఇమేజ్ జనాల్లో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొండిగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి కోర్టుల్లో అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అలాగే ప్రజల్లోనూ ఒకింత వ్యతిరేకతలు వచ్చాయి. ఈక్రమంలోనే అందరు రాజకీయ నాయకుల్లాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అనేక యూటర్న్ లు తీసుకుంటున్నారు.
nv ramana
గడిచిన రెండున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరంగా అనేక దూకుడు నిర్ణయాలు తీసుకున్నారు. ముందువెనుక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటిపై మొండిగానే ముందుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మాత్రం ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నట్లు కన్పిస్తోంది.
తాజాగా మరో విషయంలో ఆయన యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ ఎన్వీ రమణ విషయంలో గతంలో దూకుడుగా వ్యవహరించిన సీఎం ఇప్పుడు మాత్రం అతివినయం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏడాది క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి కాబోయే సీజేఐ ఎన్వీ రమణపై తీవ్రమైన అభియోగాలు చేశారు.
నాటి చీఫ్ జస్టిస్ బోబ్డేకు తన సలహాదారుడు అజేయకల్లాంతో వ్యతిరేకంగా లేఖను రాయించి దేశవ్యాప్తంగా దుమారం రేపారు. దీనికి ముందు మాజీ అడ్వేకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై రాజధాని భూముల కేసులు పెట్టారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో పెట్టిన ఆ ఎఫ్ఐఆర్లో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి.
గతంలోనూ తన తాబేదార్లు అయిన వ్యక్తులతో జస్టిస్ ఎన్వీ రమణపై చదువుకునే సమయంలో ఓ కేసు ఉందని పిటిషన్లు వేయించి భంగపడ్డారు. ఎన్వీ రమణను సుదీర్ఘకాలంగా టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టిన జగన్ ఆయన సీజేఐ అయ్యాక కూడా మనసు మార్చుకోలేదు. సీజేఐగా ఎన్వీ రమణ ఎన్నికైన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ఏపీ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. నాడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు గొప్ప ఆహ్వానం పలికింది.
అయితే ఇప్పుడు మాత్రం సీజేఐ ఎన్వీ రమణ స్వగ్రామంలో పర్యటించేందుకు మూడు రోజుల కార్యక్రమాలు ఖరారు కాగానే ప్రభుత్వం హడావుడి చేస్తోంది. గతంలో చూపించని వినయవిధేయలను ప్రభుత్వం చూపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డినే స్వయంగా సీజేఐని శాలువా కప్పి గౌరవించారు. అలాగే ప్రభుత్వం తరపున అధికారికంగా తేనీటి విందు ఇచ్చారు.
గతంలో ఇలాంటి ప్రొటోకాల్ పాటించని జగన్ సర్కారు తాజాగా మాత్రం మర్యాదల పేరుతో భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. దీంతో సీజేఐ ఎన్వీ రమణ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాళ్లబేరానికి వచ్చారా? అనే చర్చ నడుస్తోంది. ఇంత కాలం న్యాయవ్యవస్థతో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించిన జగన్ ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నట్లు కన్పిస్తోంది.
అయితే విందు, వినోదాలతో తీర్పులు మారే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చట్టం, రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పులు ఉంటాయని ప్రతీఒక్కరు గుర్తించాలని సూచిస్తున్నారు. ఏదిఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే తన మనస్తత్వాన్ని మార్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.