Wakf Amendment Bill
Wakf Amendment Bill : కేంద్రం అనుకున్నది చేసింది. వివాదాస్పద వక్ఫ్(waqf) (సవరణ) బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి, అయినప్పటికీ దాదాపు 8 గంటల చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేయాలని పట్టుదలతో ఉండగా, విపక్షాలు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024, భారత లోక్ సభలో ఆగస్టు 8, 2024న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijuju) ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వక్ఫ్ చట్టం, 1995ని సవరించే లక్ష్యంతో తీసుకొచ్చారు, దీని ద్వారా వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నమోదు, పర్యవేక్షణలో సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్తో ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపబడింది. జేపీసీ నివేదిక, సవరణల తర్వాత కేబినెట్ ఆమోదించింది. దీంతో మళ్లీ బుధవాంర(ఏప్రిల్ 2న)లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చుట్టూ తీవ్ర వివాదం, రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నాయి.
Also Read : ఏమిటీ వక్ఫ్.. దేశవ్యాప్తంగా ఎందుకింత చర్చ?
బిల్లులో ప్రధాన సవరణలు
వక్ఫ్ నిర్వచనం: ఈ బిల్లు ప్రకారం, కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ ప్రకటించగలరు, మరియు ఆస్తి యాజమాన్యం ఆ వ్యక్తి వద్ద ఉండాలి. ‘వక్ఫ్ బై యూజర్‘ (దీర్ఘకాల వినియోగం ఆధారంగా వక్ఫ్) గుర్తింపును తొలగిస్తోంది.
వక్ఫ్ బోర్డు సంఘటన: రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు ముస్లిం కాని సభ్యులు, రెండు ముస్లిం మహిళలు తప్పనిసరిగా ఉండాలి. సభ్యులను ఎన్నుకోవడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
సర్వే, వివాదాలు: వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యత డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారికి అప్పగిస్తారు. ఆస్తి వక్ఫ్దా, ప్రభుత్వ ఆస్తా అనే వివాదంలో జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.
ట్రిబ్యునల్ సంస్కరణ: వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇద్దరు సభ్యులు ఉంటారు, వారి నిర్ణయాలపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు.
పారదర్శకత: వక్ఫ్ ఆస్తుల ఖాతాలను సెంట్రల్ పోర్టల్ ద్వారా బోర్డుకు సమర్పించాలి.
ప్రభుత్వ వాదన
కొత్త పేరు..
ప్రభుత్వం ఈ బిల్లును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, 1995‘గా పేరు మార్చి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యం తీసుకొస్తుందని చెబుతోంది. మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ‘ఈ సవరణలు మత సంస్థల స్వయంప్రతిపత్తిని హరించవు, కేవలం సంస్కరణల కోసమే‘ అని స్పష్టం చేశారు.
విపక్షాల వ్యతిరేకత
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, AIMIM వంటి విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజ్యాంగ విరుద్ధం: ఈ బిల్లు ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ), 26 (మత వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛ)లను ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ విమర్శించారు.
మైనారిటీ హక్కులపై దాడి: AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును ‘వక్ఫ్ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం‘గా అభివర్ణించారు. ‘మసీదులు, దర్గాలపై వివాదాస్పద దావాలను బలపరిచేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది‘ అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ జోక్యం: జిల్లా కలెక్టర్కు అధికారాలు ఇవ్వడం ద్వారా వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తి హరించబడుతుందని తణమూల్ ఎంపీలు వాదించారు.
రాజకీయ ఉద్రిక్తత
చర్చకు 8 గంటల సమయం..
లోక్ సభలో వక్ఫ్ బిల్లుపై చర్చకు దీనికి 8 గంటల సమయం కేటాయించారు. బీజేపీ నేతృత్వంలోని NDA, విపక్ష ఇండియా బ్లాక్ మధ్య తీవ్ర ఘర్షణ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ ఎంపీలకు విప్ జారీ చేసి, సభకు హాజరు కావాలని ఆదేశించాయి. ఇండియా బ్లాక్ కూడా ఏకమైన వ్యూహంతో బిల్లును అడ్డుకోవాలని నిర్ణయించింది. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ‘ఇది బీజేపీ రాజకీయ ఎత్తుగడ, వక్ఫ్ ఆస్తులను విక్రయించే ప్రయత్నం‘ అని ఆరోపించారు.
ఈ బిల్లు వక్ఫ్ బోర్డులలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయడం వంటి లక్ష్యాలతో 1995 వక్ఫ్ చట్టంలో 40 సవరణలను ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వం ఈ మార్పులు ముస్లిం సమాజం నుండి వచ్చిన డిమాండ్ల ఆధారంగానే చేస్తున్నట్లు చెబుతోంది. విపక్షాలు దీనిని మైనారిటీ హక్కులపై దాడిగా భావిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా, లేక విపక్షాలు దాన్ని అడ్డుకుంటాయా అనేది లోక్ సభలో బలాబలాలపై ఆధారపడి ఉంది.
Also Read : శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం?
Web Title: Wakf amendment bill debate in lok sabha amidst tension and opposition protests
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com