Site icon OkTelugu

Pawan Kalyan- Volunteers: పవన్ కు అనుకూలంగా మారుతున్న వలంటీర్లు

Pawan Kalyan- Volunteers

Pawan Kalyan- Volunteers

Pawan Kalyan- Volunteers: ఏదైనా ఒక అంశంలో మంచి ఉంటుంది.. చెడు ఉంటుంది. అది మనం చూసే కోణం బట్టి కనిపిస్తుంది. వలంటీరు వ్యవస్థలో ఉన్న లోపాల విషయంలో ఇప్పుడు ఇదే తరహా విశ్లేషణ జరుగుతోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీరు వ్యవస్థను ఏర్పాటుచేశారు. సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించే బాధ్యతను కట్టబెట్టారు. అయితే నాలుగేళ్లలో ఆ వ్యవస్థ లోపాలపై ఏ నాయకుడు మాట్లాడలేదు. ఇప్పుడు పవన్ మాట్లాడేసరికి తప్పుపడుతున్నారు. తప్పు అని బలవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ తాను వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని.. ఆ వ్యవస్థలో ఉండే లోపాలను మాత్రమే ప్రస్తావిస్తున్నానని చెప్పేసరికి అందరిలోనూ ఆలోచన ప్రారంభమైంది. చివరకు వలంటీర్లలో సైతం అంతర్మథనం వ్యక్తమవుతోంది.

వలంటీరు వ్యవస్థ మంచిదే. కానీ దాని వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాలు మాత్రం అభ్యంతరకరం. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండగా సమాంతర రాజకీయ వ్యవస్థ ఎందుకు అన్నదే పవన్ ప్రశ్న. రాజ్యాంబద్ధమైన పంచాయతీలు ఉండగా వాటిని నిర్వీర్యం చేస్తూ సచివాలయాలు, వలంటీర్లు ఎందుకు? అన్నదే పవన్ వాదించే అంశం. రూ.5 వేలు ఇచ్చి ఊడిగం ఎందుకు చేయించుకుంటున్నారు? వారితో చేయరాని పనులు ఎందుకు చేయిస్తున్నారన్నదే పవన్ లేవనెత్తిన అంశం. వలంటీర్లు తనకు సోదర సమానులంటూనే.. కొందరు మాత్రమే సంఘ విఘాత చర్యలకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపిస్తున్నారు.

అయితే ఇక్కడే పవన్ వ్యాఖ్యలకు, కామెంట్స్ కు ప్రతిస్పందన దొరకడం లేదు. పవన్ లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వకుండా అదే వలంటీర్లను ముందుపెట్టి జగన్ రాజకీయ క్రీడను తెరతీశారు. పవన్ చెబుతున్నవి అబద్ధాలని చెప్పడం లేదు. పైగా వందీ మాగధులతో మాట్లాడిస్తున్నారు. మీడియా, విశ్లేషకులు, సినీ రంగ ప్రముఖులు ఇలా ఒకటేమిటి అన్నిరంగాల వారిని రంగంలోకి దించుతున్నారు. పవన్ పై వారిని దువ్వుతున్నారు. వలంటీర్లతో పవన్ దిష్టిబొమ్మలను దహనం చేయిస్తున్నారు. అక్కడితే ఆగకుండా వచ్చే ఎన్నికల్లో పవన్ ఒంటరిగా వస్తే వలంటీరుతో పోటీచేయిస్తామని మంత్రి జోగి రమేష్ లాంటి వాళ్లు చెబుతున్నారు.

అర్బన్ ప్రాంతాల్లో ఉండే వలంటీర్లకు రాజకీయాలతో సంబంధాలుండవు. వారి నియామకాల్లో పెద్దగా రాజకీయ జోక్యం లేదు. ఎందుకంటే పట్టణాల్లో ఉపాధి పుష్కలంగా దక్కుతుంది. రూ.5 వేల వేతనానికి యువత పెద్దగా ముందుకు రారు. అందుకే అక్కడ ఎటువంటి రాజకీయ సిఫారసులు లేకుండా వలంటీర్ల నియామకం పూర్తవుతుంది. ఇప్పుడు పవన్ తాజా వ్యాఖ్యలతో వలంటీర్లలో ఒక రకమైన విభజన వచ్చింది. గ్రామీణ ప్రాంత వలంటీర్లు పవన్ కు వ్యతిరేకంగా.. పట్టణ ప్రాంత వలంటీర్లు అనుకూలంగా మారుతున్నారు. మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇది వెల్లడైంది. జనసేన ప్రెస్ మీట్ కు అడ్డుకోవడానికి వలంటీర్లను తీసుకెళ్లిన వైసీపీనేతలకు చుక్కెదురయ్యింది. సభలు, సమావేశాలకని పిలిచి ఇలా తమను రాజకీయంగా వాడుకుంటారో అని ఓ మహిళా వలంటీరు ప్రశ్నించేసరికి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది. సో వలంటీర్లలో సైతం ఆలోచన మొదలైందన్న మాట.

Exit mobile version