Vijay political victory challenges: విజయ్ పార్టీ గెలిచింది. తను కూడా రెండు స్థానాలలో పోటీచేసి గెలిచాడు. అతిపెద్ద పార్టీగా అవతరించి.. అధికారంలోకి రాగలిగాడు. ఒక మంచి రోజు చూసుకొని తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 6 నెలలపాటు హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత అసలు సవారి మొదలవుతుంది. ప్రతిపక్షాలు అప్పటిదాకా ఎదురుచూస్తాయి. ఆ తర్వాత విమర్శలు మొదలు పెడతాయి. రాజకీయం అంటేనే అలా ఉంటుంది కదా.. అప్పటిదాకా విజయ్ ని అభిమానించిన వారు విమర్శలు చేస్తారు. ఏక వాక్యంతో సంబోధిస్తారు. అవసరమైతే వ్యక్తిగత విషయాలను కూడా లాగుతారు. పైగా తమిళనాడు రాజకీయాలు అత్యంత దారుణంగా ఉంటాయి.
విజయ్ ఎన్నికల ప్రచారంలో తమిళ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు.. మహిళలకు ప్రతినెల 2500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. పెళ్ళికానుకగా వధువుకు ఎనిమిది గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని వెల్లడించారు. ఉద్యోగాలు లేని గ్రాడ్యుయేట్లకు ప్రతినెల 4000 రూపాయల భృతి ఇస్తామని వెల్లడించారు. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రతినెల 3000 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గృహాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కొత్తగా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యార్థులకు 20 లక్షల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదు లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లులకు ప్రతి ఏడాది 15000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఐదు ఎకరాలకు పంట భూములు ఉన్న రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు.
ఈ హామీలు తమిళ ప్రజలను విజయ్ వైపు చూసేలా చేశాయి. తమిళనాడులో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాజకీయ పార్టీ నాయకులు సరికొత్త విధానాన్ని అవలంబిస్తారు. గతంలో కరుణానిధి, జయలలిత ఓటర్లకు టీవీలు, కుక్కర్లు, వాషింగ్ మిషన్లు కూడా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలను సోమరులను చేయడానికి తమిళనాడు నాయకులు గట్టిగానే కంకణం పట్టుకున్నారు. విజయ్ హామీ ఇచ్చినట్టుగా తమిళ ప్రజలకు ఆ పథకాలు మొత్తం అమలు కావాలంటే లక్షల కోట్ల బడ్జెట్ కావాలి.
తమిళనాడు పెద్ద రాష్ట్రం. మన దేశానికి ఆర్థికంగా బలమైన సపోర్ట్ ఇస్తున్న రాష్ట్రాలలో ముందు వరుసలో ఉంటుంది. కాకపోతే తమిళనాడు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 2024 ,25 ఆర్థిక సంవత్సరానికి గాను స్థూల రాష్ట్ర దేశ ఉత్పత్తి 31.55 లక్షల కోట్లుగా ఉంది. 2025,26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డీపీ శాతం 35,67,818 కోట్లుగా ఉంది.. రాష్ట్ర బడ్జెట్లో (మూడు శాతం) ఆర్థిక లోటు 1,06,968 కోట్లుగా ఉంది. రాబడి లోటు (1.2%) 41,635 కోట్లుగా ఉంది.
2025, 26 బడ్జెట్ అంచనా వ్యయం 4,39,293 కోట్లుగా ఉంది.. రాబడి లోటు, ఆర్థిక లోటు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. విజయ్ తన ముందు ఉన్న సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. రాష్ట్ర వనరుల నుంచి 75.3, కేంద్ర పన్నులు, గ్రాంట్ల నుంచి 24.7 శాతం రాబడిని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇది ఆచరణలో సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు.