Homeజాతీయ వార్తలుఅన్ లాక్: ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారా?

అన్ లాక్: ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారా?

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకటించాయి. తెలంగాణలో అయితే మొత్తం ఎత్తేశారు. ఏపీలోనూ ఎత్తివేయకున్నా దాదాపు ఎత్తేసినట్టే.. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుతున్న సంకేతాలు చూపిస్తుండడంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ జీవితాన్ని సులభతరం చేయడానికి లాక్డౌన్ పరిమితులను సడలించడం ప్రారంభించాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక జూలై 1 నుండి పూర్తి స్థాయిలో పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.. విద్యార్థులు ఆఫ్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చని సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కేవలం 12 గంటల రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ ప్రభుత్వం తెలిపింది. ఉదయం సమయంలో అన్ని ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి. ప్రభుత్వాలు చేతులెత్తేశాయి..

ఇప్పుడు, కోవిడ్ -19 వ్యాప్తిని నివారించే బాధ్యత ప్రజలపై పడింది. మాస్కులు ధరించడం, శారీరక దూరం పాటించడం.. శానిటైజర్లను ఉపయోగించడం వంటి కోవిడ్ -19 నిబంధనలను అనుసరించాలని ప్రభుత్వాలు కోరాయి. కోవిడ్ -19 ను నివారించడానికి ప్రజల సహకారం తప్పనిసరి అని వారు జాగ్రత్తగా ఉండాలని గమనిక ఇచ్చారు.

అయితే ప్రజలు వాటిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. లాక్డౌన్ వ్యవధిలో కూడా ప్రజలు ఆంక్షలను నిర్లక్ష్యంగా ఉల్లంఘించడం.. లాక్డౌన్ నిబంధనలను ధిక్కరించడం వంటి వాటిని చేశారు. ప్రతిసారి అన్ లాక్ అని తెరిచినప్పుడు జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే మొదటి వేవ్ తగ్గాక ప్రజల విచ్చిలవిడితనమే సెకండ్ వేవ్ కు కారణమన్న విమర్శ ఉంది.

ఇప్పుడు ప్రభుత్వాలు అన్నింటికి అన్ లాక్ విధించడంతో త్వరలో షాపింగ్ కేంద్రాలు, మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్‌లు, పబ్బులు, జిమ్‌లు, మార్కెట్లు, సినిమా థియేటర్లు, పబ్లిక్ పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు వంటి బహిరంగ సభల పున :ప్రారంభం ఉంటుంది.

ఆర్‌టిసి బస్సులు, రైళ్లు, మెట్రో రైలు సర్వీసులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలు కూడా ప్రజలకు తెరవబడతాయి. కాబట్టి, ఈ వ్యవస్థలలో భారీ రష్ ఉంటుంది. వారిపై ఎవరికి నియంత్రణ ఉండదు. దీంతో కరోనా వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఉంటుంది.

కరోనావైరస్ మూడవ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నివేదికల నేపథ్యంలో, ప్రజలు తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత ఆరోగ్య సదుపాయాలు కల్పించలేదని ప్రభుత్వంపై నిందలు వేయకుండా, తమను తాము రక్షించుకోవాల్సిన సమయం ఇదీ.

వేలాది మంది ప్రాణాలను బలిగొని లక్షలాది మంది ఆసుపత్రిలో చేర్చిన కరోనా సెకండ్ వేవ్ ప్రజల మదిలో ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రజలు కళ్లు తెరవాల్సిన సమయం ఇదీ. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోకపోతే, ఇక ఎవరూ రక్షించలేరన్న వాస్తవాన్ని గుర్తించాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version