Uber Ola Rapido users: చాలాకాలంగా ఆటోవాలాలు, క్యాబ్ యజమానులు కనీస చార్జీలు పెంచాలని కోరుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న రాష్ట్రాల్లో అయితే ఆటోలు, క్యాబ్లు ఎక్కేవారు తగ్గిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల క్యాబ్ నిర్వహణ సంస్థలతో చర్చలు జరిపింది. చార్జీల పెంపు నిబంధనలు సవరించింది. ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. కొత్త నిబంధనలు ఓలా, ఉబర్ వంటి సంస్థలకు లాభదాయకంగా ఉండగా, ప్రయాణికులపై ఆర్థిక భారం పెంచే అవకాశం ఉంది. అయితే కొన్ని షరతులతో ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నాయి.
కొత్త నిబంధనలు ఇలా..
కొత్త నిబంధనల ప్రకారం, రద్దీ సమయాల్లో క్యాబ్ సంస్థలు బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీలను విధించవచ్చు, గతంలో ఇది 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేసేందుకు కూడా అనుమతి లభించింది. ఈ మార్పు డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో క్యాబ్ సంస్థలకు ఆదాయాన్ని పెంచే అవకాశం ఇస్తుంది.
ప్రయాణికులకు కాస్త ఉప శమనం..
ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పించేందుకు, కేంద్రం ఒక ముఖ్యమైన షరతును విధించింది. మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణాలపై ఎలాంటి సర్జ్ ఛార్జీలను వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నియమం తక్కువ దూరం ప్రయాణాలు చేసే వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణికులకు ఇది ఒక ఊరట.
క్యాబ్ సంస్థలకే లాభదాయకం..
ఈ కొత్త నిబంధనలు క్యాబ్ సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నాయి. రద్దీ సమయాల్లో డిమాండ్ను లాభంగా మలచుకునే అవకాశం వారికి లభిస్తుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే వారికి ఈ ఛార్జీల పెంపు ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, ఉదయం లేదా సాయంత్రం రద్దీ సమయాల్లో ఆఫీసు లేదా ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారు ఎక్కువ ఖర్చు భరించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలు క్యాబ్ సంస్థల ఆదాయాన్ని పెంచినప్పటికీ, ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా పండుగలు, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా నిత్యం కూడా మెట్రోపాలిటన్ నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్జ్ ఛార్జీల పెంపుతో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలైన బస్సులు, మెట్రోలు లేదా ఆటో రిక్షాల వైపు మళ్లవచ్చు.