కరోనా విషయంలో సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. మరో 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పై చర్చించింది. లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉన్న లాక్ డౌన్ సడలింపును సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
లాక్ డౌన్ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంట సేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది.
మూడో విడత లాక్ డౌన్ గడువు ఈనెల 9తో ముగుస్తుండడంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఒంటి గంట వరకు తెరవగా.. దాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావించింది.