Rajaiah Vs Kadiyam Srihari : టీఆర్ఎస్ లో వారిద్దరిదీ ఒకటే నియోజకవర్గం. ఇద్దరూ వైరి వర్గాలు.. ఒకరిని మించి ఒకరు రాజకీయం చేస్తారు. ఇద్దరూ అధికార టీఆర్ఎస్ లో ఉన్నా కూడా పొసగదు.. ఈ దళిత దిగ్గజాలు ఇప్పుడు ఒకరి పరువును మరొకరు బజారున పడేసుకుంటున్నారు. తెలంగాణ తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన పదవి మూన్నాళ్ల ముచ్చట అయ్యింది. ఆరోపణలతో ఆ పదవిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఓ మహిళతో ఆయన సాగించిన సరసాలు బయటకొచ్చి పరువు పోయింది. అయినా కూడా కేసీఆర్ గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకే టికెట్ ఇవ్వడం.. ఆయన గెలవడం అందిరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదే స్టేషన్ ఘన్ పూర్ నుంచి కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడైన సీనియర్ నేత కడియం శ్రీహరి ఉన్నారు. రాజయ్య తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి కూడా చేశారు. తాటికొండ రాజయ్య ఎఫైర్లు బయటపెట్టి ఆయన పదవి పోగొట్టింది రాజయ్యనే అంటారు. వీరిద్దరి రాజకీయ వైరం కారణంగానే స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.
తాజాగా రాజయ్య , కడియం శ్రీహరి మధ్య మాటల మంటలు చెలరేగాయి. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 361 మంది నక్సలైట్లను హతమార్చారని.. తనకు అడ్డు వచ్చిన వారిని ఎన్ కౌంటర్లు చేసే వారని ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం తన అడ్డా అని..అక్కడ వేరే వారిని కాలు పెట్టనివ్వనని శపథం చేశారు.
ఇక ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై మండపడ్డ కడియం శ్రీహరి తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని కౌంటర్ ఇచ్చారు. సర్వే చేద్దామని.. నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే స్టేషన్ ఘన్ పూర్ అని సవాల్ చేశారు. రాజయ్య సిద్ధమా అని తొడగొట్టారు. మిట్ట మధ్యాహ్నం తాగి చిలిపి చేష్టలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ఎమ్మెల్యే బరితెగించిన వ్యవహారాలన్నీ తన వద్ద రికార్డుగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రికార్డులు బయటపెడితే రాజయ్య ప్రజల్లో తిరగలేరని కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు.
దళితబంధు ఇస్తానని ధావతులు చేసుకుంటున్నాడని.. చెప్పుకోలేని పనులు చేస్తున్నాడని కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బెటర్ అని.. ఇప్పటికైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే అన్నీ బయటపెడుతానని బాంబు పేల్చారు.
ఇప్పటికే ఓ మహిళతో చాటు మాటు వ్యవహారం నడిపిన రాజయ్య వాయిస్ రికార్డ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. దీన్ని కడియం శ్రీహరినే లీక్ చేశారనే ప్రచారం సాగింది. అలాంటివి చాలా ఉన్నాయని చెబుతుండడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరువు గంగలో కలవడం ఖాయమంటున్నారు. రాజయ్య నోరు జారి తనకు తానే ఇబ్బందుల్లో పడ్డారని.. శ్రీహరి బయటపెడితే అటు రాజయ్య పేరు.. ఇటు టీఆర్ఎస్ పరువు పోవడం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ చాటు మాటు రికార్డులు ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది.