KCR: కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తున్న ఆ ఇద్దరు!

ఇక తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీ చేయడానికి ముందకు రావడం ఆసక్తికరంగా, అనుమానంగా మారింది. ఎందుకు కామారెడ్డికి వస్తున్నారన్న చర్చ కామారెడ్డితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.

Written By: Raj Shekar, Updated On : November 6, 2023 3:06 pm
Follow us on

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రంజుగా, రసకందాయంగా జాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార జోరు పెంచుతున్నాయి. మరోవైపు కీలక నేతల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. కేసీఆర్‌ ఈనెల 9 నామినేషన్‌ వేయాలని నిర్ణయించగా, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సోమవారం నామినేషన్‌ వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రాజకీయం మంచి మజా ఇవ్వబోతోంది. ఈ రెండు నియోజకర్గాల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈరెండు నియోజకవర్గాల్లో ఈనెల 9న నామినేషన్‌ వేయనున్నారు.

కేసీఆర్‌పై ఆ ఇద్దరు..
ఇక తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ ఈసారి పోటీ చేయడానికి ముందకు రావడం ఆసక్తికరంగా, అనుమానంగా మారింది. ఎందుకు కామారెడ్డికి వస్తున్నారన్న చర్చ కామారెడ్డితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అయితే ఈ విషయమై కేసీఆరే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను గజ్వేల్‌లోనే ఉంటానని, కానీ కామారెడ్డిలో పోటీకి కథ వేరే ఉందని గజ్వేల్‌ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. దీంతో కామారెడ్డి కథ ఏంటన్న అనుమానాలు మొదలయ్యాయి. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని కబ్జా చేయడానికే కేసీఆర్‌ వస్తున్నారని, గెలిచినా ఇక్కడ ఉండడని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన రామారావు.. రెండు రోజులు కామారెడ్డిలోనే మకాం వేశారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేశామని ప్రకటించారు. ఈమేరకుఉత్తర్వులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కేసీఆర్‌ వస్తే కామారెడ్డి మరో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.

గులాబీ బాస్‌కు ఆ ఇద్దరి టెన్షన్‌..
ఇదిలా ఉంటే.. గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో కేసీఆర్‌ పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమేరకు బీజేపీ అధిష్టానం కూడా టికెట్‌ ఇచ్చింది. ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌పై బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణలో అసలైన మజా రాజకీయాలు మొదలయ్యాయి. సాధారణంగా పెద్ద నాయకులు బరిలో ఉన్న చోట చిన్న నాయకులను నిలిపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ, ఈ సంప్రదాయానికి తాజా ఎన్నికల్లో ఈటల, రేవంత్‌ బ్రేక్‌ చేశారు. కేసీఆర్‌ టార్గెట్‌గా అనిపై పోటీకి సిద్ధమయ్యారు. ఈటల సోమవారం నామినేషన్‌ వేయనుండగా, రేవంత్‌ ఈనెల 7న నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు.

ఎవరు గెలిచినా రాజీనామా చేసుడే..
అయితే, కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల నేతలు ఈసారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి ముగ్గురూ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డిలో గెలిస్తే కామారెడ్డిని వదులుకోవడం ఖాయం. ఇక ఈటల రాజేందర్‌ హుజూరాబాద్, గజ్వేల్‌లో పోటీ చేస్తున్నారు. ఆయన రెండోచోట్ల గెలిస్తే గజ్వేల్‌ను వదులుకుంటారు, రేవంత్‌రెడి కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో నిలస్తున్నారు. ఆయన రెండు చోట్ల గెలిస్తే కామారెడ్డిని వదులుకుంటారు.

కామారెడ్డికి బై ఎలక్షన్స్‌..
ముగ్గురు నేతల్లో ఎవరు గెలిచినా కామారెడ్డి ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈ విషయాన్ని ఆయా అభ్యర్థులే చెబుతున్నారు. మరి ఈ ఎన్నికల ఖర్చు ఎవరు భరించాలన్న చర్చ మొదలైంది. రెండు చోట్ల పోటీ చేయడం ఎందుకు, గెలిచినా రాజీనామా చేయడం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు గెలుపు అవకాశాలు ఉన్నందున ఎన్నికల నిర్వహణ ఖర్చు ప్రజలపై వేయకుండా, కేసీఆరే భరించాలన్న చర్చ జరరగుతోంది.

మొత్తంగా ఈసారి ఎన్నికలు మాత్రం రసకందాయంగా మారాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌కే ఆ ఇద్దరు నేతలు చెమటలు పట్టించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో 2024లో రాజకీయాలు మారితో మరింత రంజుగా ఉంటుందన్నచర్చ జరగుతోంది. చంద్రబాబుపై పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, జగన్‌పై పవన్‌ లేదా, లోకేషన్‌ బరిలో నిలిపితే తెలంగాణ తరహా రసవత్తర రాజకీయాలు ఆంధ్రాలోను జరుగుతాయని అంటున్నారు విశ్లేషకులు.