కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై కరోనా మహమ్మరి ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి విలవిలాడిపోతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.
Also Read: కమలంలో ఆధిపత్య పోరు మొదలైందా?
ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. పౌష్టిహారం తీసుకుంటూ ఇమ్యూనిటీ పెంచుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా.. వస్తుందా? రాదా అనే భయాందోళన చాలామందిలో నెలకొని ఉంది. వీరందరి భయాన్ని దూరం చేసేలా ఓ ప్రొఫెసర్ ఏకంగా కోవిడ్ జాకెట్ రూపొందించారు. ఈ జాకెట్ ధరిస్తే కరోనా వైరస్.. బ్యాక్టిరియా వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఆయన చెబుతున్నారు.
అహ్మదాబాద్లోని ఎన్ఐడీ మాజీ ప్రొఫెసర్, అప్పారెల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సోమేష్ సింగ్ కోవెస్ట్ పేరిట ఓ జాకెట్ను రూపొందించారు. దీనిని తయారు చేయడానికి ఆయన రెండునెలల సమయం పట్టిందట. ఇది నాలుగు పొరలతో ఉండి జాకెట్ ధరించిన వారికి వైరస్, బ్యాక్టిరియా నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందట. సిమెంట్ ఫ్యాబ్రిక్, సింథటిక్ పదార్థాలు కలిపి లెదర్ జాకెట్ లుక్ వచ్చేలా ఈ జాకెట్ ను రూపొందించారు. అనంతరం జాకెట్పై వైరోబ్యాన్-ఎన్9 ఎస్సీ100 కోటింగ్ వేశారు. అలాగే ఈ జాకెట్లో సోషల్ డిస్టన్సింగ్ సెన్సార్ను ఏర్పాటు చేయడం వల్ల దూరం పాటించేలా అలర్ట్ చేస్తుంది.
Also Read: మోదీ క్యాబినెట్లో కొత్తగా ఎంతమంది ఎంట్రీ ఇవ్వనున్నారు?
ఈ జాకెట్ తోపాటే మాస్కును కూడా అందిస్తున్నారు. ఈ జాకెట్ జేబులకు లోపలి వైపు యూవీ లైట్ను ఏర్పాటు చేశారు. ఈ జేబుల్లో వాహనాల తాళం చెవులు, స్మార్ట్ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు వేస్తే 30సెకన్లలో అవి శానిటైజ్ అవుతాయి. ఈ జాకెట్కు ఓ థర్మామీటర్ను కూడా అమర్చారు. అందువల్ల శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సోమేష్ సింగ్ ఈ జాకెట్కు సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి తీసుకొస్తానని చెబుతున్నాడు.
దీని ధర రూ.4,999 నుంచి అందుబాటులో ఉంటుందని అన్ని సైజుల్లో లభిస్తుందని చెబుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వినూత్న జాకెట్లు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయమనే కామెంట్లు విన్పిస్తున్నాయి.