తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీని నిలువరించగలదని ఇప్పటికి నేను భావించట్లేదు అని పేర్కొన్నారు. థర్డ్ ఫ్రంట్ అనేది పాత కాన్సెప్ట్ ఇప్పటికే ఆ మోడల్ ను ప్రయోగించడం, పరీక్షించడం జరిగియన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు ఆ మోడల్ సరిపోదు అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
శరత్ పవార్ తో భేటీపై స్పందిస్తూ తాము గతంలో కలిసి పనిచేయనందున ఒకరి గురించి మరొకరికి తెలుసుకునే అవకాశం కలిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులపై సీరియస్ గా చర్చించామని పేర్కొన్నారు. రాష్ర్టాల వారీగా ఎక్కడెక్కడ బీజేపీని ఎదుర్కోగలమో వంటి అంశాలపై చర్చించామన్నారు. థర్డ్ ఫ్రంట్ తరహా మోడల్ గురించి ఇప్పటికైతే తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
ఎన్సీపీనేత శరత్ పవార్ తో ప్రశాంత్ కిషోర్ సోమవారం భేటీ అనంతరం దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఏర్పడే పరిణామాలపై చర్చించారు. మంగళవారం విపక్ష పార్టీలతో సమావేశానికి శరత్ పవార్ పిలుపునివ్వడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. కాంగ్రెసేతర పక్షాలన్ని ఒకే తాటిపైకి వచ్చేందుకు 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శరత్ పవార్ అధ్యక్షతన రేపు విపక్షాల భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. బీజేపీ లక్ష్యంగా విపక్షాలను ఏకం చేసేందుకు ఈ సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.