కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభా పక్షం ఆయన్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇవాళ (జూలై 28) ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కర్నాటక రాష్ట్రానికి 22వ సీఎంగా బసవరాజ్ బొమ్మై సేవలు అందించనున్నారు. అయితే.. ఎంతో మంది సీఎం కుర్చీ కోసం పోటీ పడినప్పటికీ.. బసవరాజ్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. దీనికి కారణమేంటీ? బొమ్మైని మాత్రమే ఆ సీట్లో కూర్చోబెట్టాలని ఎందుకు నిర్ణయించింది??
యడ్యూరప్ప తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనే విషయమై అభిప్రాయ సేకరణ చేసేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్, కన్నడ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ కు అప్పగించింది బీజేపీ హైకమాండ్. వీరిద్దరూ కన్నడ నేతలతో విడివిడిగా.. సమష్టిగా చర్చలు సాగించారు. ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే బాగుంటుందని వివరాలు సేకరించారు.
అయితే.. ముఖ్యమంత్రి సీటుపై కూర్చునేందుకు తహతహలాడిన వారి సంఖ్య తక్కువేమీ లేదు. బసవరాజ్ బొమ్మైతోపాటు గనుల శాఖ మంత్రి మురగేష్ నిర్వాణి, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది, మరో డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అంతేకాకుండా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, స్పీకర్ విశ్వేశ్వర కాగేరితోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్నాటక బీజేపీ నేత బీఎల్ సంతోష్ కూడా రేసులో ఉన్నారనే ప్రచారం సాగింది. వీరంతా ఎవరికి వారు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. అధిష్టానం మాత్రం బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గు చూపింది.
జనతాదళ్ పార్టీతో బొమ్మై రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2008లో కమలం తీర్థం పుచ్చుకున్నారు. 1998, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో షిగ్గావ్ నుంచి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతేకాకుండా.. బొమ్మై రాజకీయ వారసత్వం కూడా పెద్దదే. ఆయన తండ్రి ఎస్ ఆర్ బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎస్ ఆర్ బొమ్మై వారసుడిగా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టిన బొమ్మై.. క్లీన్ ఇమేజ్ తోనే ముందుకు సాగారు.
ఆయనకు సీఎం పదవి రావడంలో ఆ ఇమేజ్ కలిసి వచ్చిందని చెబుతారు. అంతేకాకుండా.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా పెద్దే. దీంతోపాటు అతిముఖ్యమైన అంశం కూడా ఆయన త్రాసులో చేరింది. బసవరాజ్ బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. మాజీ సీఎం యడ్యూరప్ప సైతం లింగాయతే. యెడ్డీ వీరశైవ లింగాయత్ కాగా.. బసవరాజ్ సదర లింగాయత్ వర్గానికి చెందినవారు. కర్నాటకలో లింగాయత్ ల ప్రాబల్యమే అధికం. వీరు బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్నారు. ఈ కోణంలోనే ఆలోచించిన అధిష్టానం.. బొమ్మైని సీఎంను చేసిందని అంటున్నారు.
గతంలో జలవనరుల శాఖ మంత్రిగా బొమ్మై పనిచేశారు. ఈ సమయంలో షిగ్గావ్ లో నిర్మించిన పూర్తి పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టులో బొమ్మై కీలక పాత్ర పోషించారు. ఇక, ఆయన వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీర్. కెరీర్ తొలినాళ్లలో టాటా గ్రూపులో కూడా పనిచేశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.