Telangana Police: కేసీఆర్‌ ఎలా చెబితే.. పోలీసులు అలా..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం కాస్త ఎక్కువే. 2002లో నాటి ముఖ్యమంత్రి చంబ్రాబు నాయుడిపై అలిపిరి వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : June 20, 2023 5:04 pm

Telangana Police

Follow us on

Telangana Police: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోలీస్‌ శాఖను బలోపేతం చేశారు. పోలీసులకు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేశారు. 9 ఏళ్లలో నాలుగు సార్లు పోలీస్‌ నియామకాలు చేపట్టారు. ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. ఇక వేతనాలు కూడా హోం గార్డు నుంచి మొదలు.. డీజీపీ వరకు భారీగా పెంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ పోలీస్‌ ఫ్రెండ్లీ సీఎంగా మారారు. దీంతో ఆయన ఏం చెప్పిన చేసేస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు ఏడాది క్రితం పెట్టిన ‘ఉపా’ కేసు ఎత్తివేశారు. ఏడాది క్రితం అనేక మందిపై ఉపా కేసు పెట్టిన పోలీసులు సీఎం ఆదేశాలతో కీలకమైన ఆరుగురిపై మాత్రం ఎత్తేశారు.

ఆశ్చర్యపోయేలా పోలీసుల నిర్ణయం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం కాస్త ఎక్కువే. 2002లో నాటి ముఖ్యమంత్రి చంబ్రాబు నాయుడిపై అలిపిరి వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే సానుభూతి పనిచేయలేదు. నాడు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టిన వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాడు మావోయిస్టులను చర్చలకు పిలిచారు. వైఎస్సార్‌ పిలుపులో మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించారు. పోలీసులు కూడా సీఎం మాటకు విలువ ఇచ్చి కాల్పులు ఆపేశారు.

సుదీర్ఘ చర్చలు..
అయితే మావోయిస్టుల చర్చల సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేతలంతా వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు పేర్లు మాత్రమే తెలిసిన కొంతమంది మావోయిస్టు పెద్దలు పోలీసులకు ఐడెంటిఫై అయ్యారు. సుదీర్ఘంగా జరిపిన చర్చల మధ్యలో స్తబ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో మావోయిస్టుల పునరావాసం, కేసుల ఎత్తివేతపై సీఎం వైఎస్సార్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పోలీసులు ఒప్పుకోలేదు. తాము ఇన్నాళ్లూ మావోయిస్టులతో తలపడ్డామని, ఈ క్రమంలో ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇప్పుడు కేసులు ఎత్తివేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎత్తివేసేది లేదని స్పష్టం చేశారు.

అర్ధంతంరంగా ముగిసిన చర్చలు..
ఈ క్రమంలో మావోయిస్టులతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత పోలీసులు మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరినీ ఎన్‌కౌంటర్‌ చేస్తూ వచ్చారు. గుర్తు తెలియని వారిని కూడా పట్టుకుని మరీ చంపేశారు. చర్చల కారణంగా మావోయిస్టుల ఉనికే ప్రశ్నార్థకమైంది. తర్వాత వైఎస్సార్‌ హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. దీంతో ఎన్‌కౌంటర్‌ అయిన మావోయిస్టు కుటుంబాల శాపంతోనే వైఎస్సార్‌ మృతిచెందాడని అప్పట్లో పలువురు చర్చించారు కూడా.

నాడు కుదరదని.. నేడు ఎత్తివేత..
మావోయిస్టులపై కేసులు ఎత్తివేయడానికి వైఎస్సార్‌ హయాంలో కుదరదని చెప్పిన పోలీసులు ఇప్పుడు మాత్రం కేసీఆర్‌ ఇలా చెప్పారో లేదో.. అలా కేసులు ఎత్తివేశారు. అయితే హరగోపాల్‌ మాత్రం ఆరుగురిపై ఎత్తివేత సరికాదని అందరిపైనా ఎత్తివేయాలని కోరుతున్నాడు. అసలు ఉప చట్టంపైనే చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు కేంద్రంపైనా ఒత్తిడి తెస్తామంటున్నారు. ఏది ఏమైనా.. తెలంగాణ పోలీసులు కేసీఆర్‌ చెప్పు చేతల్లో పనిచేస్తున్నార్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.