Homeజాతీయ వార్తలుMatthieu Ricard : ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఎవరు? అతడి జీవిత రహస్యం ఏంటో...

Matthieu Ricard : ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఎవరు? అతడి జీవిత రహస్యం ఏంటో తెలుసా ?

Matthieu Ricard : సంతోషం అనేది మనసులో ఉద్భవించే ఓ భావోద్వేగం మాత్రమే కాదు.. అది మానసిక స్థితిగతులను ప్రభావితం చేసే శాస్త్రీయ అంశమని ఇప్పటికే పలు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా రికార్డులకెక్కారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్టులు మాథ్యూ రికార్డ్ మెదడును 12 ఏళ్లపాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ధ్యానం వల్ల మెదడులో మార్పులు
మాథ్యూ రికార్డ్ ధ్యానం చేసినప్పుడు మెదడులో ఏర్పడే గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.ఆయన మెదడులో వెలువడిన ధ్వని తరంగాలు, నాడీ ప్రేరణలు సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. మాథ్యూ రికార్డ్ మెదడులో సంతోషం, సహానుభూతి వంటి భావోద్వేగాలను నియంత్రించే భాగాలు సాధారణ మానవుల కంటే చురుకుగా ఉన్నట్లు వెల్లడైంది.

256 సెన్సార్లతో 12 ఏళ్ల అధ్యయనం
విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్టులు మాథ్యూ మెదడును పరిశీలించేందుకు 256 సెన్సార్లతో అతని తలకు అనుసంధానం చేశారు. ఈ సెన్సార్లు నాడీ సంకేతాలను, మెదడులో జరిగే రసాయన మార్పులను వివరంగా విశ్లేషించాయి. ఆయన ధ్యానం చేసే సమయంలో గామా తరంగాల ఉత్పత్తి అత్యధిక స్థాయిలో కనిపించడంతో శాస్త్రవేత్తలు విస్తుపోయారు. “ఇంత పెద్ద మొత్తంలో గామా తరంగాల ఉత్పత్తి ఇంతవరకు ఎప్పుడూ ఎవరిలోనూ చూడలేదు” అని పరిశోధకులు వ్యాఖ్యానించారు.

ఎవరు ఈ మాథ్యూ రికార్డ్?
మాథ్యూ రికార్డ్ అసలు పేరు రిచర్డ్‌ రికార్డ్. ఆయన ఫ్రాన్స్‌లో జన్మించారు. చిన్నతనం నుంచి మానసిక శాస్త్రం, తత్వశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు. 26 ఏళ్ల వయసులో టిబెటన్ బౌద్ధ సన్యాసిగా మారారు. ధ్యానం, ఆధ్యాత్మికతను లోతుగా అభ్యసించి, ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారు. ఇప్పుడు ఆయన బౌద్ధ సిద్ధాంతాలను ప్రపంచానికి ప్రచారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారటమే కాకుండా, మెదడులో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

ధ్యానం కారణంగా గామా తరంగాలు పెరిగి, మెదడు మరింత ఆరోగ్యంగా మారుతుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో ధ్యానం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ధ్యానం ద్వారా మెదడులో డోపమైన్, సెరటొనిన్ వంటి హార్మోన్లు విడుదలై సంతోషాన్ని పెంచుతాయి. ధ్యానం ఎక్కువగా చేసే వ్యక్తులు ఇతరులతో ఎక్కువగా అనుభూతిని పంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు.

ఈ అధ్యయనంతో మరోసారి ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో శాస్త్రీయంగా రుజువైంది. మెదడును ఆనందంతో నింపుకోవాలంటే బాహ్య వాతావరణం మాత్రమే కాకుండా, అంతర్గత శాంతి, ధ్యానం వంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. మాథ్యూ రికార్డ్ లాంటి వ్యక్తులు ధ్యానం ద్వారా జీవితాన్ని ఆనందంతో నింపుకోవచ్చని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular