తెలంగాణ రాష్ట్రంలో వారి బతుకులు భారం!

తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీసీ పెద్ద రవాణా వ్యవస్థ. అంత పెద్ద వ్యవస్థలో కార్మికుల బతుకులు భారమయ్యాయి. కరోనా కాటుతో బస్సులు నడవకపోవడం.. సిబ్బందికి డ్యూటీలు వేయకపోవడంతో కార్మికులు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. నెలనెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చినా ఎంత ఇస్తారో తెలియని దుస్థితి. ఆది నుంచి రాష్ట్రంలో కష్టాల్లోనే ఉన్న ఆర్టీసీ కరోనాతో మరింత కుదేలైంది. ఎప్పటి నుంచో లాస్‌లోనే నడుస్తున్న సంస్థపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సర్వీసులను పునఃప్రారంభించినా […]

Written By: NARESH, Updated On : September 1, 2020 12:17 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీసీ పెద్ద రవాణా వ్యవస్థ. అంత పెద్ద వ్యవస్థలో కార్మికుల బతుకులు భారమయ్యాయి. కరోనా కాటుతో బస్సులు నడవకపోవడం.. సిబ్బందికి డ్యూటీలు వేయకపోవడంతో కార్మికులు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. నెలనెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చినా ఎంత ఇస్తారో తెలియని దుస్థితి.

ఆది నుంచి రాష్ట్రంలో కష్టాల్లోనే ఉన్న ఆర్టీసీ కరోనాతో మరింత కుదేలైంది. ఎప్పటి నుంచో లాస్‌లోనే నడుస్తున్న సంస్థపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సర్వీసులను పునఃప్రారంభించినా పెద్దగా ఆదాయం రావడం లేదు. దీంతో స్టాఫ్‌కు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకుండా ఉంది సంస్థ. లాక్‌డౌన్‌ ఎత్తివేసి బస్సులు నడిపిస్తున్నా ప్రయాణికులు ఎవరూ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు రావడం లేదు. ఎవరి నుంచి తమకు కరోనా వైరస్‌ సోకుంతుందో అనే భయం వారిలో ఇంకా కనిపిస్తోంది. దీంతో ఎక్కువగా ప్రైవేటు వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంకా రూరల్‌ ఏరియాస్‌లో అయితే సర్వీసులు ప్రారంభానికే నోచుకోలేదు. 10,400 బస్సులకు గాను 3 వేల బస్సులను మాత్రమే తిప్పుతున్నారు. రూ.2.50 కోట్ల ఆదాయం వస్తున్నా అవి మెయింటనెన్స్‌కే సరిపోతున్నాయి.

సంస్థలో సుమారు 49,200 మంది సిబ్బంది ఉన్నారు. 20 వేల వరకు పెన్షన్‌దారులు ఉన్నారు. నెలనెలా రూ.169 కోట్ల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాలో 9 కోట్లు మాత్రమే ఉన్నాయి. రెండు నెలలుగా రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. అవి సుమారుగా రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈనెల జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే సంస్థకు రూ.207 కోట్లు అవసరం. కానీ.. అంత మొత్తం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. సంస్థకు ఆదాయం వచ్చే దిక్కు లేదు. ప్రస్తుతం సంస్థ నెత్తిన సుమారు రూ.3,700 కోట్ల అప్పు ఉంది.

ఇప్పటికే సంస్థ ఆస్తులను తనఖా పెట్టి రూ.600 కోట్లు అప్పు తెచ్చింది. మే నెల వరకు జీతాలు సర్దుబాటు చేసింది. ఖాతాలో ఖాళీ కావడంతో జూన్‌ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆఫీసర్లు, కార్మిక సంఘాలు సర్కార్‌‌తో మొరపెట్టుకున్నాయి. ఆ సమయంలో రూ.150 కోట్లు ఇచ్చింది. ఇక జూలై, ఆగస్టు నెలల వేతనాలు ఆగిపోయాయి. కొత్తగా కార్గో పార్శిల్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చినా రెస్పాన్స్‌ నామమాత్రంగానే కనిపిస్తోంది. మరోవైపు జీతాల కోసం కార్మికులు సంస్థను కోరుతూనే ఉన్నారు. జీతాలు ఇవ్వకుండా తమ కుటుంబాలను ఎలా పోషించుకునేది అని ఆవేదన చెందుతున్నారు. కరోనా ఉన్నా రిస్క్‌ చేసి డ్యూటీలు చేస్తున్నామని.. అయినా తమకు సంస్థ నుంచి ఎలాంటి భరోసా లేదని.. కనీసం జీతాలైనా ఇవ్వాలని కోరుతున్నారు.