Homeజాతీయ వార్తలుBJP Party : బీజేపీలో కొత్త అధ్యక్షులొస్తున్నారోచ్‌..

BJP Party : బీజేపీలో కొత్త అధ్యక్షులొస్తున్నారోచ్‌..

BJP Party : కాషాయం పార్టీలో రానున్న కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో సంస్థాగత మార్పులు చోటు చేసుకోనున్నాయి. జాతీయ అధ్యక్షుడితో పాటు ఆయా రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణాకు సైతం కొత్త చీఫ్‌ రానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమావేశానికి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వంటి కీలక నేతలు హాజరయ్యారు.

*జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు..
బీజేపీలో కొత్త సంవత్సరంలో అంతా కొత్తదనం సంతరించుకునేలా ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు నూతన అధ్యక్షుల నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. జనవరి నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ముందుగా జిల్లా అధ్యక్షుల నుంచి షురూ చేయనుంది. జనవరి 10లోగా ఆయా జిల్లాల అధ్యక్షులు, 15 వరకు రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసి నెలాఖరులోగా జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నుంచి నివేదిక రూపంలో వివరాలు సేకరించింది.
*రాష్ట్ర పగ్గాలు ఎవరికో..?*
బీజేపీలో ఒకప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అంతగా పోటీ ఉండేది కాదు. ఒకరిద్దరి పేర్లను పరిశీలించి నిర్ణయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పోటీ తీవ్రమైంది. దక్షణాదిన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధిష్టానం ఇతర పార్టీల్లోని కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. ఆ సమయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చాలా మందికి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని సీనియర్లకు కాషాయ కండువా కప్పింది. ఇప్పటికే పలువురికి కీలక బాధ్యతలు సైతం అప్పగించింది. అయితే కొంతమంది మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేశారు. ఇప్పటికే అధిష్టానంను కలిసి తమకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
*ఇటు అసెంబ్లీ.. అటు లోక్‌సభలో పెరిగిన ప్రాతినిధ్యం..*
పార్టీకి రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్‌సభలోనూ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరిగింది. 8మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలు ఈ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు. రాష్ట్ర, జాతీయస్థాయికి చెందిన సీనియర్లు సైతం పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొనసాగున్నారు. అలాగే మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని ఇటీవల ప్రకటించడం గమనార్హం.
*రాష్ట్ర చీఫ్‌ రేసులో వీరే..*
ప్రధానంగా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందర్‌రెడ్డి, అరవింద్‌ వంటి తదితర సీనియర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీసీ కోటా నుంచి చూస్తే రాజేందర్‌కు మహిళా కోటా నుంచి అయితే అరుణకు దక్కవచ్చని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular