BRS vs Congress : తెలంగాణలో ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యే..

ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక నేతల వలస పెరిగింది. త్వరలో పొంగులేటి, జూపల్లి సహా సీనియర్లు చేరుతున్నారు. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు ఆగి చతికిలపడుతోంది.

Written By: Raj Shekar, Updated On : June 19, 2023 9:43 pm
Follow us on

BRS vs Congress : : ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున గెలిచింది కేవలం గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ , బండి సంజయ్ లాంటి హేమా హేమీలు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేయకపోవడంతోనే ఎంపీ సీట్లు గెలిచారు. కాబట్టి ఆ మాత్రం బలం పుంజుకుంది. ఇక తర్వాత జరిగిన ఉప ఎన్నికలమైన బలమైన నాయకులు అయిన ఈటల రాజేందర్, రఘునందన్ రావుల వల్లే బీజేపీ తెలంగాణలో గెలవగలిగింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా కూడా ‘ట్రిపుల్ ఆర్’ ఎమ్మెల్యేలతో కమలం ఇంకా హస్తం కంటే బాగా వెనుకబడే ఉంది! అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు…

క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే మాత్రం ఇప్పటికీ తెలంగాణలో బీజేపీకి 119 నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తల బలం లేదు అనడంలో సందేహం లేదు. బీజేపీ ఇప్పటికీ ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి అరువు నేతలను తీసుకొచ్చుకొని బలపడింది. అయితే కాంగ్రెస్ కు అలా కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తల బలం ఉంది. బీజేపీకి ఖమ్మంలో అసలు బలం లేదు. టీఆర్ఎస్ కూడా ఈ జిల్లాలో వీక్. కానీ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది.

ప్రస్తుతం దేశంలో బీజేపీకి దెబ్బలు తగులుతున్నాయి. హిమాచల్ మొదలు కర్ణాటక దాకా అనేక చోట్ల ఓడిపోతోన్న కమల దళం తెలంగాణలో ఏ మాత్రం ఎదిగే సూచనలు కనిపించటం లేదు. ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమీటి అంటూ ఒకటి ఏర్పాటు చేసి… దానికి నాయకుడ్ని చేశారు. అయినా చేరికలూ జరగలేదు. తీసివేతలు కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది టీ బీజేపీ పరిస్థితి. పైగా గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలంలో ముసలం పుడుతోంది… ఇక బండి సంజయ్ తీరును స్వయంగా ఎంపీ ధర్మపురి, ఈటల రాజేందర్ వ్యతిరేకించడంతో ఆ పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకత్వ మార్పు చేయకుండా బీజేపీ బండి సంజయ్ తోనే వెళ్లాలని సి్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతోన్న వేళ ప్రెసిడెంట్ ని మార్చితే గందరగోళం అవుతుందని ఇలా సర్దుకుపోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక నేతల వలస పెరిగింది. త్వరలో పొంగులేటి, జూపల్లి సహా సీనియర్లు చేరుతున్నారు. అదే సమయంలో బీజేపీలోకి చేరికలు ఆగి చతికిలపడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు పోటీగా అధికారానికి దగ్గరగా కాంగ్రెస్ నిలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే కనిపిస్తోంది.. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ హస్తం పార్టీ చరిత్ర సృష్టిస్తే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. బీజేపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవని అర్థమవుతోంది.