Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఒంటిచేత్తో పార్టీని అన్నీ తానై నడిపించిన బండి సంజయ్ ఒక దశలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కమలమే అన్నత హైప్ తెచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయానికి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీని బీజేపీ ఓడించినంత పని చేయడానికి కారణం బండి సంజయ్ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రజాసంగ్రామ పాదయాత్రలు, కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా చేసే ప్రసంగాలు, హిందుత్వ ఎజెండా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంత మైలేజ్ తెచ్చాయి. దీంతో బీజేపీ అధిష్టానం కూడా బండి సారథ్యంంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావించింది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి, కొంతమంది సీనియర్లకు బండి దూకుడు నచ్చలేదు. ఒక్కడికే మైలేజ్ వస్తుందన్న అసూయతో బండిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. బండిని తప్పిస్తేనే పార్టీ తెలంగాణలో గెలుస్తుందని చెప్పారు. బండిని తప్పించకుంటే చాలా మంది పార్టీని వీడతారని అల్టిమేటం ఇచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో బీజేపీ సంజయ్ను తప్పించి కిషన్రెడ్డికి పగ్గాలు అప్పగించింది. దీని వెనుక బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. బండి సంజయ్ని తప్పంచకుంటే పార్టీని వీడారని చెప్పన నేతలు.. బండిని తప్పించిన తర్వాత పార్టీ నుంచి వలసలు పెరగడం బీజేపీని కలవర పెడుతోంది.
ఫలించని ఈటల బుజ్జగింపులు..
బీజేపీ నుంచి మారిపోతారని భావిస్తున్న నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చేస్తున్న బుజ్జగిపులు ఫలించడం లేదు. గతంలో ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారవద్దని బుజ్జగించిన సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేసేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి తన రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారులు భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. పార్టీలో పనిచేవారిని ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్.. గత కొన్నిరోలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా ఐదుసార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనకు మరోసారి ఓటమే ఎదురైంది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీని వీడారు.
చంద్రశేఖర్ బాటలో మరికొందు..
చంద్రశేఖర్తోపాటు పలువురు బీజేపీ నేతలు.. కాంగ్రెస్లో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోపు పార్టీ అధ్యక్షుడ్ని మార్చడం.. ఈటలకు కీలక పదవి ఇవ్వడంతో అందరూ ఆగిపోతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని.. మారాలనుకున్న వారంతా కాంగ్రెస్లోకి వెళ్లిపోయేందుకు డిసైడయ్యారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. త్వరలో మరికొందరు బీజేపీని వీడతారని తెలుస్తోంది. నాడు బీజేపీలో చేరితేనే భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉంటే కష్టమే అన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో తమ దారి తాము చూసుకుంటున్నారు. బుజ్జగింపులు పనిచేయడం లేదు.