ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖాముఖి చర్చలో పలు విషయాలపై కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాబుల్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ అఫ్గనిస్తాన్ విషయంలో పాటించే వైఖరులు, అల్ ఖైదా, ఐఎస్-కే, హడ్కానీ గ్రూపు ల తీరుపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఏర్పడింది. పాకిస్తాన్ సాయంతో తాలిబన్లను తమ వశం చేసుకునే క్రమంలో చైనా అవలంభించే వైఖరులపై భారత్ ప్రధానంగా చర్చించనుంది. క్వాడ్ దేశాధినేతలతో మోడీ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
అయితే అమెరికా బ్రిటన్, ఆస్రేలియాతో కలిసి ఆకస్ అనే కొత్త కూటమికి శ్రీకారం చుట్టింది. ఇందులో భారత్ కు చోటు దక్కలేదు. దీంతో దీనిపై ఇండియా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఇందులో మనకు ఎలాంటి నష్టం లేదని చెబుతోంది. చైనా ఆగడాలకు కళ్లెం వేయాలని భావిస్తున్న భారత్ కు అమెరికా పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇండో పసిఫిక్ జలాల్లో అన్ని దేశాల నౌకలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు ఉండాలని భావిస్తోంది.
ఈనెల 17న షాంఘై సహకార మండలి సమావేశంలో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొని శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. ఓడరేవుల ద్వారా అన్ని దేశాలు కలిసి వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు. ఏ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లినా సహించేది లేదని తేల్చి చెప్పారు. బైడెన్, మోడీ మధ్య చర్చల్లో కూడా ఇవే విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. కొవిడ్ వల్ల ప్రపంచానికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా అవలంభించబోయే విధానాలపై కూడా చర్చించనున్నారు.
వాతావరణ మార్పుల్లో కూడా పెనుప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గ్లోబలైజేషన్ ప్రభావంతో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. దక్షిణాసియాపై పట్టు సాధించే క్రమంలో చైనా అవలంభిస్తున్న వైఖరిపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు మేల్కొని భూతాపాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం మోడీ పలు విషయాలపై దేశాలకు మార్గనిర్దేశనం చేయనున్నారు.