TRS Party: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వేళ... అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కోర్టుకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి తలనొప్పిగా మారిన కొన్ని గుర్తులను ఈసీ కేటాయించకుండా చూడాలని బుధవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

Written By: Raj Shekar, Updated On : October 19, 2023 1:58 pm

TRS Party

Follow us on

TRS Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. మరోవైపు విపక్షాలు బీఆర్‌ఎస్‌ స్పీడ్‌కు బ్రేకులు వేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌పై ఈసీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈసీ బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తెలంగాణ రాజ్య సమితి(టీఆర్‌ఎస్‌)కు సిలిండర్‌ గుర్తు కేటాయించింది.

ఉద్యమకారులతో పార్టీ..
తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు కలిసి తెలంగాణ రాజ్య సమితి పార్టీని రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని.. టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తును కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్‌ సిలిండర్‌ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీసం 5% సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంది. లేదంటే.. సదరు పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని కూడా స్పష్టంగా పేర్కొంది.

బీఆర్‌ఎస్‌గా మారిన పాత టీఆర్‌ఎస్‌..
తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ ఈ పార్టీపైనే రెండ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే జాతీయ రాజకీయాల కోసం ఏడాది క్రితం టీఆర్‌ఎస్‌న బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈమేరకు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ కూడా చేయించారు. పార్లీమెంట్‌లో కూడా స్పీకర్‌ బీఆర్‌ఎస్‌గా గుర్తించారు. తమ పార్టీ నుంచి తెలంగాణను తొలగించిన కేసీఆర్‌కు ఉద్యమకారులు షాక్‌ ఇచ్చారు. తెలంగాణ రాజ్య సమితి(టీఆర్‌ఎస్‌) పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.

వివాదాస్పద గుర్తులపై పిటిషన్‌..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వేళ… అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కోర్టుకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీకి తలనొప్పిగా మారిన కొన్ని గుర్తులను ఈసీ కేటాయించకుండా చూడాలని బుధవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అయితే తర్వాత దానిని ఉప సంహరించుకుంది. ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్ల యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈసీకి పలుమార్లు వినతి..
ఎన్నికలు జరిగిన ప్రతీసారి బీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీ గుర్తు కారును పోలిన కొన్ని గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి విన్నవిస్తోంది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డు రోలర్‌ గుర్తును తొలగించినప్పటికీ తర్వాత ఎన్నికల నుంచి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ వస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతలు ఆ గుర్తును తొలగించాలని కోరుతున్నారు.

ఇబ్బందిగా మారిన గుర్తులు ఇవీ..
కారును పోలిన రోడ్డు రోలర్‌తోపాటు కెమెరా, చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్, సిలిండర్‌ వంటి గుర్తులు బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ గుర్తుల కారణంగా కారుకు పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నట్లు బీఆర్‌ఎస్‌ పేర్కొంటోంది. ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది.

ఇటు టీఆర్‌ఎస్‌.. అటు సిలిండ్‌ సింబల్‌..
ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పేరు అధికార బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది కరంగా మారనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఏ గుర్తు వద్దంటుందో అదే గుర్తును ఈసీ తాజాగా తెలంగాణ రాజ్య సమితి(టీఆర్‌ఎస్‌)కే కేటాయించింది. ఒకవైపు టీఆర్‌ఎస్‌ పేరు.. ఇంకోవైపు సిలిండర్‌ గుర్తు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు చీల్చడం ఖాయం అంటున్నారు. మరి చూడాలి దీనిపై బీఆర్‌ఎస్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందో..