spot_img
Homeజాతీయ వార్తలుCongress Party : దేశానికి కాంగ్రెస్ అవసరం ఉంది... కానీ ఆ పార్టీకే ఆ విషయం...

Congress Party : దేశానికి కాంగ్రెస్ అవసరం ఉంది… కానీ ఆ పార్టీకే ఆ విషయం తెలియడం లేదు

Congress Party : ఎవడి దరిద్రానికి వాడి చేష్టలే కారణమవుతాయి. కొన్ని కొన్ని సార్లు ఇతరులు చేసిన తప్పిదాలు కూడా మన టైం లైన్ ను నిర్దేశిస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే దుస్థితి అనుభవిస్తోంది. వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ నేడు ప్రాభవం కోసం పోరడాల్సిరావటం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండిపోయింది. మరి ఈసారైనా అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఆ పార్టీ ఒకప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి వేటు ఎదుర్కొన్నారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పతనం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకంగా ఉన్న గులాం నబి ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. నిన్నటికి నిన్న గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ఏకే ఆటోని కొడుకు కమలం కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలు మొత్తం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కి ఇక కోలుకోదా? దాని నాయకత్వం మీద నాయకులకు నమ్మకం లేదా? పార్టీ అధినాయకత్వం భవిష్యత్తు మీద ఎందుకు భరోసా కల్పించలేకపోతోంది? ఇన్నేసీ ప్రశ్నలు ఉత్పనమవుతున్నప్పటికీ సమాధానం చెప్పేవారు కరువుతున్నారు.

గులాం నబి ఆజాద్ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెబుతుంటే.. అందులో నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించడం.. అతడు కన్నీరు పెట్టడం నిజంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఊహించి ఉండరు.

రాహుల్ గాంధీ కలలో అయినా కలగని ఉండరు. ” ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంతగా విమర్శించినా… ఆయన నా పట్ల ఎంతో అపారమైన ప్రేమను చూపించారు. ఆయన గౌరవానికి నేను ముగ్ధుడినయ్యాను.” అంటూ గులాం నబి ఆజాద్ చెప్పడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి చెంప దెబ్బ లాంటిది. అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు సోనియాగాంధీని తలవలేదు. రాహుల్ గాంధీని జ్ఞప్తిలోకి తీసుకోలేదు. కానీ పార్టీని విడిపోతున్నప్పుడు గులాం నబీ ఆజాద్ తన ఆత్మ కథలో కాంగ్రెస్ పార్టీ పతనానికి గల కారణాలను చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఆయన ఎప్పుడు పుస్తకం రాసినప్పటికీ.. అవి ప్రస్తుత పరిస్థితులనూ ప్రతిబింబిస్తున్నాయి. “అగోని ఆఫ్ ఆజాద్” పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్రమంగా పతనం కావడానికి 1963 లో మొదలైన కామరాజ్ ప్రణాళిక కారణమని ఆజాద్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆజాద్ బయటకు వెళ్లిపోయారు కాబట్టి.. ఇప్పుడు ఆయన మాటలను చాలామంది వక్రీకరించవచ్చు. మీడియా కూడా పెడర్థాలు తీయవచ్చు. కానీ వాస్తవాన్ని చెరిపివేసే ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ 1963 లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఒక పార్టీ నిర్వహణ ప్రణాళిక అందజేశారు. రాష్ట్రాల్లో బలంగా ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్రంలో బలంగా ఉన్న మంత్రుల దగ్గర రాజీనామాలు తీసుకొని.. వారిని పార్టీ పనుల్లో పెట్టాలి. వారిని ఆయా స్థానాల నియమించాలి. దీని ప్రకారం కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి వదులుకొని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. ఇక ఒడిశాలోని బిజూ పట్నాయక్, ఎస్కే పాటిల్, ప్రతాప్ సింగ్ కైరాన్, భక్షి గులాం మహమ్మద్ వంటి ముఖ్యమంత్రులు కూడా అహిష్టంగా రాజీనామాలు చేశారు. ఆల్ బహదూర్ శాస్త్రి, జగ్జీవన్ రామ్, మొరార్జీ దేషాయ్ దిగ్గజాలైన లాంటి కేంద్ర మంత్రులు కూడా అఇష్టంగానే పదవులు వదులుకొని.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. దెబ్బకు 1967లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సీకే అన్నాదురై స్థాపించిన ప్రాంతీయ పార్టీ విజయ దుందుభి మోగించింది.

“ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మని నరుక్కుంది కదా” అని ప్రణబ్ ముఖర్జీ అప్పట్లో గులాంనబీ తో చెప్పాడు. అయితే దానికి ఆజాద్ ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు. బహుశా చెప్పేంత ఉన్నప్పటికీ ప్రణబ్ ముఖర్జీ వయసులో పెద్దవాడు అయినందువల్ల నిశ్శబ్దంగా ఉన్నాడు. ” కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు మిగతావారు బలవంతులుగా ఉండకూడదు. వారికి జనాదరణ అసలు ఉండకూడదు. జస్ట్ డూడూ బసవన్నల్లాగా ఉండాలి. అందుకే మాట వినే తోలుబొమ్మలను కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేసేది. దీనికి నెహ్రూ అతీతుడు ఏమీ కాదు. కామరాజ్ చెప్పిన ప్రణాళిక కూడా అతడికి నచ్చే అమలులో పెట్టి ఉంటాడు” అని తన ఆత్మ కథలో ఆజాద్ పేర్కొన్నాడు.

ఇక ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ, తరుణ్ గోగోయ్ జుట్లు పట్టుకుంటూ ఉంటే.. హిమంతకే జనామోదం ఉందని గులాం నబీ ఆజాద్ చెబితే రాహుల్ పెడచెవిన పెట్టాడు. తరుణ్ వైపు రాహుల్ నిలబడటంతో హిమంత పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కాంగ్రెస్ పార్టీ దాని ఫలితాన్ని అనుభవిస్తోంది.

అంతేకాదు మహారాష్ట్రలో ఠాక్రే ప్రభుత్వం ఎందుకు కూలిపోయిందో అందరికీ తెలుసు. కానీ ఇది తన తప్పిదమని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాదు సచిన్ పైలెట్లు, సింధియాలు, సిద్ధ రామయ్యలు.. ఎవరిని చూసినా తెలిసిపోతుంది కదా? ఎవరు కాటికి కాళ్లు చాచి.. వారెలా బతికి ఉన్నారో వారికే ఆశ్చర్యంగా ఉన్నవారిని.. కాంగ్రెస్ పార్టీ ఎలా ఏరి కోరి నెత్తిన పెట్టుకుంటుందో..

ఇవాల్టికి హిందువులు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో ఆ పార్టీ తెలుసుకోలేదు. తెలిసినా ఏం చేయలేదు. దేశ యువత ఎందుకు దూరం అవుతుందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆయన ఏం చేయలేదు. గత 30 సంవత్సరాలలో పార్టీకి విధేయులుగా ఉండాల్సిన వారు సొంత పార్టీలు పెట్టుకుని అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండిపోయింది తప్ప ఏమి చేయలేకపోయింది.. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో నాయకులు విదేశాల్లో దాచిన సంపద వీకి లీక్స్ చెబితే తప్ప తెలియ రాలేదు.. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. పైగా పార్టీ నిర్వహణ కోసం బిచ్చమెత్తుకుంటున్నది. చివరగా చెప్పాలంటే దేశానికి కాంగ్రెస్ అవసరం ఉంది. అది దేశ ప్రజలకు తెలుసు. కానీ కాంగ్రెస్ కే దేశంతో అవసరం ఉన్నట్టు తెలియడం లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular