Modi Cabinet 2024: మోదీ 3.0 లో మంత్రుల కూర్పు ఖరారు.. చంద్రబాబు, నితీష్ పార్టీలలో వీరికే పదవులు..

మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత కాంగ్రెసేతర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 6:05 pm

Modi Cabinet 2024

Follow us on

Modi Cabinet 2024: భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.. బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు కావాల్సి ఉండగా.. 240 స్థానాలు మాత్రమే దక్కించుకోవడంతో.. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అవసరం బిజెపికి ఏర్పడింది.. వీరు సహకారం అందించడంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు సహకారం వల్ల ఎన్డీఏ బలం 293 స్థానాలకు చేరుకుంది. జూన్ 9, ఆదివారం నాడు నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఈ చర్చలలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ వంటి వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే భాగస్వామ్య పక్షాలకు ఇవ్వబోయే మంత్రిత్వ శాఖల గురించి ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై అటు చంద్రబాబు, ఇటు నితీష్ కుమార్ సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఇటీవల ఎన్నికల్లో టిడిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. జేడీయూ బీహార్ రాష్ట్రంలో 12 స్థానాలను దక్కించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టిడిపి నాలుగు మినిస్ట్రీ పదవులు, ఒక పార్లమెంటరీ స్పీకర్ పదవిని కోరింది.. జెడియు రెండు క్యాబినెట్ మినిస్ట్రీ పోస్టులు కావాలని అడిగింది. టిడిపి నేతలలో రామ్మోహన్ నాయుడు, హరీష్ బాలయోగి, దగ్గు మల్ల ప్రసాద్ కు మంత్రిత్వ శాఖలు లభించే అవకాశం కనిపిస్తోంది. మిగతా పదవుల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక నితీష్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో సీనియర్ నేతలు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి.. లాలన్ సింగ్ బీహార్ లోని ముంగేర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రామ్ నాథ్ భారతరత్న పురస్కార గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.

ఇక మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత కాంగ్రెసేతర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మాల్దీవులు, మారిషస్ దేశాల చెందిన ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ఇతర దేశాలకు చెందిన అతిరథ మహారధులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ముందు నితీష్ కుమార్ ఇండియా కుటమిలో చేరుతారని వార్తలు వినిపించాయి. మమతా బెనర్జీ ఆయనతో మాట్లాడారని, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చని సంకేతాలు వినిపించాయి. అయితే వీటన్నింటిని నితీష్ కుమార్ తోసిపుచ్చారు.. తను కచ్చితంగా ఎన్డీఏ కూటమిలోని సాగుతానని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఊహగానాలకు చెక్ పడింది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.