Homeఆంధ్రప్రదేశ్‌Jagan Govt: జగన్ కు గట్టి షాకిచ్చిన కేంద్రం

Jagan Govt: జగన్ కు గట్టి షాకిచ్చిన కేంద్రం

Jagan Govt: జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేసింది. ఇష్టారాజ్యంగా ఖర్చు పెడితే కుదరదని.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించింది. కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు.. కేంద్రం పేరే ఉండాలని స్పష్టం చేసింది. ఇకనుంచి నవరత్నాల లోగోలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆ బొమ్మలు పెడితే నిధులు ఇవ్వమని కూడా చెప్పేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కార్కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలావరకు కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్నవే. కానీ వాటిని తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా గృహ నిర్మాణం నిధుల విషయంలో కేంద్రానిదే సింహభాగం. దానిని దాచి పెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి మభ్య పెడుతోంది. ఈ విషయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. బిజెపి రాష్ట్ర నాయకులు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం విషయంలో కఠినంగా వ్యవహరించడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెబుతోంది. గృహ నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు చాలా తక్కువ. కానీ మొత్తం గృహ నిర్మాణం క్రెడిట్ తనకే దక్కించుకునేందుకు జగన్ సర్కార్ ఆరాటపడుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు వైయస్సార్ పేరుని జోడించి పీఎంఏవై- వైయస్సార్ బీఎల్సీ పథకంగా మార్చింది. అందులో కేంద్ర ప్రభుత్వ లోగో తో పాటు సీఎం జగన్ బొమ్మతో కూడిన నవరత్న లోగో పెడుతోంది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైయస్సార్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవలసి వచ్చింది. ఇప్పటికే పూర్తయిన 5 లక్షల ఇళ్లకు సంబంధించి బోర్డులను సైతం మారుస్తామని కేంద్రానికి నివేదించింది.

ఇటీవల కేంద్ర బృందం రాష్ట్రంలో గృహ నిర్మాణ స్థితిగతులను పరిశీలించింది. దాదాపు పది జిల్లాల్లో ఈ పరిశీలన ప్రక్రియ జరిగింది. అయితే అప్పటికప్పుడు గృహ నిర్మాణానికి సంబంధించి బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వైఎస్ఆర్ పేరు, నవరత్నాలు లేకుండా చేసింది. రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇచ్చింది. దీనికి అనుగుణంగానే కేంద్రం తాజాగా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క గృహ నిర్మాణమే కాదు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసిడిఎస్, వాసన పథకాలకు సంబంధించి కూడా కేంద్రం భారీగా సహకరిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలు కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం ప్యాకెట్ల పై సైతం జగన్, రాజశేఖర్ రెడ్డి ఫోటోలను ముద్రిస్తున్నారు. దీనిపై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిధులు ఆపేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి సుమారు 4000 కోట్లు నిలిపివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ కు కేంద్రం జలక్ ఇచ్చినట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version