ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ తలెత్తింది. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని ఉన్నఫళంగా అడ్డుకుంది తెలంగాణ. వడ్ల లోడుతో వస్తున్న వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు! దీంతో.. ఊహించని పరిణామంతో ఏపీ రైతులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ.. తమను అడ్డుకున్నారని, ఇది సరికాదని ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న గద్వాల జిల్లా పుల్లూరు టోల్ […]

Written By: Bhaskar, Updated On : November 26, 2021 12:13 pm
Follow us on

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ తలెత్తింది. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని ఉన్నఫళంగా అడ్డుకుంది తెలంగాణ. వడ్ల లోడుతో వస్తున్న వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు! దీంతో.. ఊహించని పరిణామంతో ఏపీ రైతులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ.. తమను అడ్డుకున్నారని, ఇది సరికాదని ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రినుంచే ఈ చర్యకు దిగారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆపేస్తున్నారు. ఫలితంగా.. ధాన్యంతో వచ్చిన లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల రగడ సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధా\న్యం కొనుగోలు చేయట్లేదని తెలంగాణ సర్కారు వాదిస్తోంది. దీన్ని బీజేపీ కౌంటర్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేయకుండా కేంద్రాన్ని నిందిస్తోందని కమలనాథులు అంటున్నారు. ఈ వివాదం రోజులతరబడి సాగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. తెలంగాణ సర్కారు ధర్నాకు సైతం దిగింది. అంతేకాదు.. వరి సాగు చేయొద్దని కూడా రైతులకు సూచించింది తెలంగాణ సర్కారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు అంశమే డైలమాలో పడింది. అందుకే.. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డుకున్నట్టు సమాచారం.

అయితే.. ఏపీ రైతులు మాత్రం తీవ్ర అవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యాన్ని తిరిగి తీసుకెళ్లి, నిల్వ చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ విషయంపై స్పందించి.. తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే విషయంపై ఈరోజు స్పష్టత రానుంది. ఇవాళ కేంద్ర మంత్రితో.. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో కేంద్రం ఎంత మేర ధాన్యం కొనుగోలు చేయనుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ మొదలైంది. ఇప్పటికే కొనసాగుతున్న నీటి వివాదం.. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ మధ్య కరోనా పేషెంట్లను అనుమతించే విషయంలోనూ వివాదం చెలరేగింది. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల గొడవ. మరి, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి వైఖరి అవలంభించనున్నారు? కేంద్ర ఏమైనా జోక్యం చేసుకుంటుందా? ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి.