రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అనేది పాపులర్ సామెత. అంటే.. తాము తీసుకునే నిర్ణయాలే తమ పతనానికి కారణమవుతాయన్నది సారాంశం. ఇప్పుడు జగన్ విషయంలో ఇదే జరిగిందని అంటున్నారు. కేసీఆర్ రాజకీయం పూర్తిగా తెలిసి నమ్మారో.. తెలియక విశ్వసించారో గానీ.. మొత్తానికి ఆయన్ను నమ్మారు. ఆ తర్వాత నిండా మునిగారని అంటున్నారు విశ్లేషకులు. జల జగడంలో కేసీఆర్ పెడుతున్న పేచీలు.. తీసుకుంటున్న నిర్ణయాలు చూసి జగన్ ఇరుక్కుపోయారని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర విభజనకు ముందే.. చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ కు కోపం ఉందన్నది బహిరంగ సత్యమే. ఇంకా వెనక్కు వెళ్తే.. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడానికి ప్రధాన కారణం కూడా చంద్రబాబుపై కోపమే! అలాంటి చంద్రబాబు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండొద్దని బలంగా కోరుకున్నారు. ఆ విధంగా.. జగన్ గెలుపునకు పూర్తిగా సహకరించారు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించారు. ఈ స్నేహం ఇలాగే ఉంటుందని జగన్ భావించి ఉంటారు. కానీ.. రాజకీయం అంటే కేవలం అవసరమే. అది నిత్యం మారిపోతూనే ఉంటుంది.
దోస్తానా బాగానే ఉందని భావించిన జగన్ రాయల సీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టారు. కానీ.. ఇది చట్ట విరుద్ధం అంటూ ఇప్పుడు పంచాయితీ మొదలు పెట్టి రచ్చ చేస్తున్నారు కేసీఆర్. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం.. లేఖల వార్ కొనసాగుతోంది. అయితే.. రెండు రాష్ట్రాల ప్రజలను మభ్య పెట్టేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న డ్రామా ఇది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ.. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు జగన్ సర్కారు చిక్కుల్లో పడిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కునే మాటలేవీ జగన్ ప్రభుత్వం నుంచి రాలేదు. ఒక్కసారి మాట్లాడిన జగన్.. పక్క రాష్ట్రంతో స్నేహాన్నే కోరుకుంటున్నామని చెప్పారు.
ఇటు కేసీఆర్ మాత్రం తాము చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ ను సైతం శ్రీశైలం నీటితో తయారు చేస్తూ.. ఖర్చు తగ్గించుకునే ప్లాన్ వేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలనూ అడక్కుండా గతంలోనే ఫ్రెండ్షిప్ ను వాడేశారు. ఇంకా.. పలు వాటాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు నీళ్ల పంచాయితీ పెట్టి.. ట్రిబ్యునల్ కేటాయింపుల్లేవు.. ఏమీ లేవు.. రెండు రాష్ట్రాలో చెరో సగం పంచుకోవాల్సిందేనని సరికొత్త డిమాండ్ పెట్టారు.
ఈ విధంగా.. తనకు కావాల్సిన పనులు చేసుకోవడం కోసం కేసీఆర్ వేసిన రాజకీయంలో జగన్ చిత్తైపోయారని అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబుపై కోపంతో జగన్ గెలిపించారే తప్ప, ప్రేమతో కాదని తెలిసి వచ్చిందంటున్నారు. ఇక, రాజకీయంగా జగన్ తో ప్రత్యేకమైన అవసరాలు కేసీఆర్ కు ఏవీ లేవు. దీంతో.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని, తనదైన రాజకీయం మొదలు పెట్టారని, ఈ విషయం జగన్ కు అర్థమయ్యే సరికి ఆలస్యమైందని అంటున్నారు. మరి, జగన్ ఈ రాజకీయాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.